వెలాసిటితో గొడవ: 'నారాయణ'కు తెలంగాణ నోటీసులు, ఇదీ జరిగింది!
హైదరాబాద్: రెండు కార్పోరేట్ కాలేజీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి సంబంధించిన అంశంలో సైబర్ సిటీ పోలీసులు గురువారం నాడు నారాయణ, చైతన్య గ్రూప్ విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నారాయణ కాలేజీ పైన వెలాసిటీ కాలేజీ ఫిర్యాదు చేయగా నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజీలు నారాయణ, వెలాసిటీల మధ్య రగడ విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ గొడవ ఇటీవల విజయవాడకు మారింది. వెలాసిటీలో పనిచేస్తూ అదృశ్యమయ్యారని చెబుతున్న అశ్వత్థ రావు మంగళవారం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.
నారాయణ వర్సెస్ వెలాసిటీ: సినిమా సన్నివేశాలే...
ఆశ్వత్థ రావు కోసం వెతికిన వెలాసిటీ కాలేజీ బృందం తెలంగాణ ప్రాంత నారాయణ కాలేజీల జిఎం కాట్రగడ్డ శ్రీనివాస్, రాయలసీమ ఇంచార్జీ విజయభాస్కర రెడ్డిలపై మంగళవారం ఒత్తిడి తేవడంతో, కాట్రగడ్డ శ్రీనివాస్ ఇంటికి తాళాలు వేసుకుని అదృశ్యమయ్యారు. మరోపక్క వెలాసిటీ సంస్థ ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
దీంతో వ్యవహారం రసవత్తరంగా మారింది. వెలాసిటీలో కీలకమైన ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులూ తొలుత నారాయణ, తర్వాత శ్రీ చైతన్య అనంతరం చైనా బ్యాచ్కు పనిచేసిన వారే. అంతేకాదు, అక్కడ సిఇఓగా పనిచేస్తున్న సొహైల్ సైతం తొలుత శ్రీచైతన్య, తర్వాత నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసి వెలాసిటీలో చేరారు.
అశ్వత్థరావును తాము ఎత్తుకురాలేదని, ఆయన స్వచ్ఛందగా వచ్చారని నారాయణ విద్యాసంస్థల ప్రతినిధి ఒకరు చెప్పారు. అశ్వత్థరావు వెలాసిటీ విద్యాసంస్థలో కోటి రూపాయిలకు పైగా వేతనానికి అగ్రిమెంట్ చేసుకున్నారని చెబుతున్నారు. అందులో అపుడే 50 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని, అడ్వాన్స్ తీసుకున్నారు కనుక తమ సంస్థలో పని చేయమని అంటున్నామని వెలాసిటీ కాలేజీ చెబుతోంది.
వెలాసిటీలో మూడు పాఠశాలలకు చెందిన ముగ్గురు అధినేతలు భాగస్వామ్యులుగా ఉన్నారు. వారిలో ఒకరు టిఆర్ఎస్ మంత్రికి అత్యంత సన్నిహితులు కావడంతో కేసును పోలీసులు సైతం తేలిగ్గా తీసుకోలేదని అంటున్నారు. అందరినీ పిలిపించి హైదరాబాద్లో కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించుకోవల్సిందిగా ఇదివరకే సంకేతాలు పంపారని వార్తలు వచ్చాయి.
ప్రతి ఏటా అడ్మిషన్ల సమయంలో వేరే సంస్థ విద్యార్థులను రాయితీలు, బహుమతులిచ్చి తమ సంస్థల్లో చేరుకోవడం అలవాటుగా మారిన కార్పొరేట్ కాలేజీలు తాజాగా మంచి పేరు సంపాదించుకున్న అధ్యాపకులను సైతం బలవంతంగా తీసుకెళ్లడం ఆనవాయితీగా మారినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.