సివిల్స్లో తెలుగు విద్యార్థుల సత్తా, టాప్ 100లో..
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. ఇందులో అమ్మాయిలు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 50కి పైగా విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100లో 14 మంది తెలుగు వారు ఉండటం గమనార్హం.
సివిల్స్లో తొలి నాలుగు స్థానాల్ని అమ్మాయిలే దక్కించుకున్నారు. ముగ్గురూ ఢిల్లీకి చెందినవారే. ఢిల్లీ అమ్మాయి, అంగవైకల్య ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్) అధికారి ఇరా సింఘాల్ జనరల్ కేటగిరీలో ఆలిండియా తొలిర్యాంకు సాధించింది. ఓ అంగవైకల్య అభ్యర్థి తొలి ర్యాంకు సాధించడం సివిల్స్ చరిత్రలో తొలిసారి.
కేరళ కొట్టాయంకు చెందిన వైద్యురాలు రేణురాజ్, ఢిల్లీకి చెందిన నిధి గుప్తా, వందనారావులు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. బిహార్ కుర్రాడు సుహర్ష భగత్ది ఐదో ర్యాంకు దక్కించుకున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ సహా వివిధ సర్వీసులకు మొత్తం 1,236 మంది అర్హత సాధించారు.
590 జనరల్, 354 ఓబీసీ, 194 ఎస్సీ, 98 ఎస్టీ విభాగాలకు చెందిన వారున్నారు. ఇరా ఆరో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించింది. రేణు తొలి ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించింది. నిధి ప్రస్తుతం కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్.
జనరల్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించిన వందనది ఓబీసీ విభాగంలో తొలిర్యాంకు. ఆమెకు మూడో ప్రయత్నం. దేశవ్యాప్తంగా 9.45 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 4.51 లక్షల మంది రాశారు. 16,933 మంది ప్రధాన పరీక్షకి, 3,308 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు.
50 మందికి పైగా తెలుగు వారు సత్తా చాటారు. తెలుగువారిలో అత్యుత్తమ ర్యాంకుల్లో 14, 18, 30 ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ 2014లో వందలోపు 10 మందికి పైగా; 300లోపు 15 ర్యాంకులు సాధించారు. దేశవ్యాప్తంగా 1,236 పోస్టులకు ఫలితాలు వెల్లడిస్తే వాటిలో 50కిపైగా ర్యాంకులను తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే సాధించారు.
జాతీయస్థాయిలో ముసినిపల్లి రాజా సాకేత్ 14న ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన సాయికాంత్ వర్మ 18వ ర్యాంకు, కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన పోట్రు గౌతమ్ 30వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్కు చెందిన రోషన్ మూడో ప్రయత్నంలో 44వ ర్యాంక్, గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 66వ ర్యాంకు,పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన తన్నీరు లక్ష్మీభవ్య 88వ ర్యాంక్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన పింగళి సతీశ్ రెడ్డి 97వ ర్యాంక్ సాధించారు.
అమలాపురం పట్టణానికి చెందిన రాఘవ సాయికృష్ణమ నాయుడు నాలుగో ప్రయత్నంలో 284వ ర్యాంకు సాధించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంధ అభ్యర్థి కట్టా సింహాచలం సివిల్స్లో సత్తా చాటారు. మూడో ప్రయత్నంలో ఆయన 1,212వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల్లో సుంకర రాజగోపాల్ 49, క్రాంతికుమార్ 50, వేదితా రెడ్డి 71, సఫీర్ కరీం 112, అభిషిక్త్ కిషోర్ 166, వల్లూరి క్రాంతి 230 తదితరులు ర్యాంకులు సాధించారు.