ఫామ్హౌస్లో కెసిఆర్: టోపీ పెట్టుకుని.. (పిక్చర్స్)
జగదేవ్పూర్: మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో జిల్లాస్థాయి అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం మధ్యాహ్నం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న నిర్వి హించే సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కెసిఆర్ సూచించారు. తలపై టోపీ పెట్టుకుని కూడా కెసిఆర్ కనిపంచారు.
ఎక్కడా ఇబ్బందులు జరుగకుండా సర్వే సజావుగా సాగే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమగ్ర సర్వేలో ప్రజలంతా పాల్గొనే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. ప్రజలందరికీ సర్వే గురించి తెలియాలంటే ఇప్పటినుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నేటినుంచే జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వేపై గ్రామాలలో ప్రచారం నిర్వహించాలన్నారు.
వివిధ పద్ధతుల్లో గ్రామస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే ఈ నెల 15వ తేదీనుంచి దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనిని కూడా పకడ్బందీగా చేట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
టోపీతో కెసిఆర్ ఇలా..
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తలపై టోపీ పెట్టుకుని తన వ్యవసాయ క్షేత్రంలో ఇలా కనిపించారు.
అర్హులకే భూపంపిణీ
అర్హులకే భూ పంపిణీ జరిగే విధంగా చూడాలని, ఒక్క అనర్హుడికి కూడా భూ పంపిణీ జరుగకూడదని, అలా జరిగితే పూర్తి బాధ్యత అధికారులదేనని, ఈ విషయంలో ఉపేక్షించబోయేదిలేదని కెసిఆర్ అన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధి
మెదక్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం ఏర్పరచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
భూముల సేకరణ వేగవంతం
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ భూముల సేకరణ వేగవంతం చేయాలని ఇప్పటికే కొంత మేరకు చేపట్టినప్పటికీ మొత్తం వివరాలతో నివేదికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
సమీక్షా సమావేశం
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్, సిద్దిపేట అర్డీవో ముత్యంరెడ్డి, ‘గడ' అధికారి హన్మంతరావు, జగదేవ్పూర్ తహసీల్దార్ రాములు, ఆర్ అండ్ బీ ఈఈ బాలనర్సయ్య, వివిధ శాఖల జిల్లా, డివిజన్స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇలా కనిపించారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రజలతో మాట్లాడుతూ ఇలా కనిపించారు. ఆయన ప్రజలతో మమేకం కావడానికి చూస్తున్నారు.
భుజంపై టవల్..
తన భుజంపై టవల్ వేసుకుని, తనను కలవడానికి వచ్చినవారితో ఇలా మాట్లాడుతూ కెసిఆర్ కనిపించారు.
స్పష్టమైన ఆదేశాలు..
సమగ్ర కుటుంబ సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్న స్థితిలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలను కెసిఆర్ జారీ చేశారు.