గులాబీ పార్టీలో కోల్డ్వార్!? ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్య పోరు?
టీఆర్ఎస్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కోల్డ్వార్ సాగుతోంది. ఇన్ని రోజులు ఎమ్మెల్సీల నిధుల విషయమై నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు అధికార దర్పం విషయంలో పోరు మొదలైంది.
Recommended Video
హైదరాబాద్: టీఆర్ఎస్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కోల్డ్వార్ సాగుతోంది. ఇన్ని రోజులు ఎమ్మెల్సీల నిధుల విషయమై నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు అధికార దర్పం విషయంలో పోరు మొదలైంది.
ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీల జోక్యం ఏమిటన్న అంశం తాజాగా వారి మధ్య వివాదానికి బీజం నాటింది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి చివరకు సీఎం కేసీఆర్ వద్దకు చేరిందట.
పట్టు నిలుపుకునే పనిలో ఎమ్మెల్యేలు...
ఎన్నికలకు ఇక ఏడాదిన్నర సమయమే ఉండడంతో ఆయా నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే తమ తమ స్థానాలలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తమకొచ్చే నిధులను ఖర్చు చేస్తున్నారు. తమ అనుచరుల్లో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారిని అనునయించి మళ్లీ దగ్గరికి తీసుకుంటున్నారు.
రంగంలోకి ఎమ్మెల్సీలు...
మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో కలియతిరగడం, మీటింగ్లు నిర్వహించడం వంటి అంశాలు ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీలు తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారో అన్న సందేహం కూడా ఎమ్మెల్యేలను పట్టి పీడిస్తోందట.
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం...
తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వేలు పెడుతుండడం కొంతమంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. "ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, గెలిచి మా సత్తా చాటుకున్నాం. మా నియోజకవర్గంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. అంతా మేమే చూసుకుంటాం. ఎమ్మెల్సీలు తమ పరిధి తెలుసుకుంటే మంచిది...'' అని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
విభేదాలు సీఎం దృష్టికి...
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య అంతరం బాగా పెరిగింది. కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగాయి. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా వచ్చాయి. దీంతో ఆయన ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం కేసీఆర్ ఘాటుగానే స్పందించినట్టు పార్టీ వర్గాల భోగట్టా.
క్లాసు పీకిన సీఎం కేసీఆర్...
ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి క్లాస్ పీకినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రచారం కూడా జరుగుతోంది. ఇది జరిగిన కొద్దిరోజులకే మళ్లీ భూపతిరెడ్డి అనుచరులు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో సదరు ఎమ్మెల్సీని సీఎం తన ఛాంబర్కి పలిపించి మరీ అక్షింతలు వేసినట్టు సమాచారం!
చాలాచోట్ల ఇదే పరిస్థితి?
టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నడుమ సాగుతున్న ఆధిపత్య ధోరణి ఒక్క నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాలేదు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ క్లాస్లు పీకడంతో ఎమ్మెల్యేలకు కొండంత బలం వచ్చిందంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తూ.. సీనియర్ నేతలు ఎమ్మెల్సీలుగా ఉన్నచోట ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.