శృతి ఎన్కౌంటర్: వివాదాస్పదం, వరవర్రావు తీవ్రవ్యాఖ్య
వరంగల్: ఓరుగల్లులో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన వారిలో శృతి అలియాస్ మహిత అనే ఎంటెక్ యువతి కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శృతి... కార్పోరేట్ల రాష్ట్రం వచ్చిందని ఆరోపిస్తూ మావో వైపు వెళ్లింది.
జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమేనని పౌరహక్కుల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు. పోలీసులు తమ బిడ్డలను హింసించి చంపారని ఎన్కౌంటర్ మృతులైన శ్రుతి, విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ల తల్లిదండ్రులు వాపోయారు.
శ్రుతిని చిత్రహింసలు పెట్టారని ఆమె మృతదేహంపై ఉన్న గాయాలను తండ్రి సుదర్శన్ చూపించారు. ఆమెపై లైంగిక దాడి కూడా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు యాసిడ్తో గాయపరిచి అతి క్రూరంగా ప్రవర్తించారన్నారు. అందుకు అవునన్నట్లు ఆమె తొడపైన యాసిడ్ దాడి గాయాలు చూపించారు.
శ్రుతి, సాగర్ల మృతదేహాలకు బుధవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, విప్లవ, ప్రజా సంఘాల నేతలు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఎంజీఎం మార్చురీ వద్దకు వచ్చారు. పోలీసులను భారీగా మోహరించారు.
ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన పోస్ట్ మార్టం ప్రక్రియ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. పోలీసులు శ్రుతి, సాగర్ తల్లిదండ్రులు, ఇతరులను మార్చురీ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
పోస్ట్ మార్టం ఆలస్యం చేయడంతోపాటు తొలుత విద్యాసాగర్ రెడ్డి మృత దేహాన్ని పోలీసులు రూటు మార్చి వాహనాన్ని పంపించారు. తదుపరి శ్రుతి మృతదేహాన్ని తరలించారు. సాగర్ మృతదేహానికి ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో అంత్యక్రియలు నిర్వహించారు.
విప్లవ గీతాలు ఆలపిస్తూ ఆయన అంతిమ యాత్ర నిర్వహించారు. శ్రుతి అంత్యక్రియలు హన్మకొండలోని పద్మాక్షిగుట్ట ప్రాంతంలోని శ్మశాన వాటికలో జరిగాయి. శ్రుతి చితికి ఆమె తల్లిదండ్రులు, విరసం నేత వరవర రావు నిప్పంటించారు.
ఎంజిఎం ఆసుపత్రి వద్ద వరవర రావు మీడియాతో మాట్లాడుతూ.... మావోయిస్టుల సిద్ధాంతాలను అమలు చేయడం ప్రభుత్వానికి చేతకాదని, కనీసం రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మేరకైనా పాలన సాగించాలని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గాలింపు చర్యలు చేపట్టారన్నారు. శ్రుతిపై లైంగిక దాడికి పాల్పడటం అమానుషమన్నారు.