సాయంత్రం వరకు కోర్టులోనే: సాయిరెడ్డి గైర్హాజరుకు కారణం
హైదరాబాద్: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం సాయంత్రం తీసుకోకపోవడానికి కారణం తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కోటాలోని నాలుగు సీట్లకు కేవలం నాలుగు నామినేషన్లే దాఖలైన నేపథ్యంలో టీడీపీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి సురేశ్ ప్రభులతో పాటు వైసీపీ తరఫున బరిలోకి దిగిన విజయ సాయిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి హోదాలోని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ శుక్రవారం ప్రకటించారు.
ఏకగ్రీవం: సాయిరెడ్డి గైర్హాజరు, ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీలు
ఈ క్రమంలో రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను తీసుకునేందుకు తీసుకునేందుకు నలుగురూ సిద్ధమయ్యారు. వైయస్ జగన్ అక్రమాస్తుల విజయ సాయి ఏ 2 నిందితుడుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం విజయసాయి రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు.
దీంతో నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై సమాచారం అందుకున్న విజయసాయిరెడ్డి పరుగు పరుగున నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఇటీవలే ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని, ఆ కారణంగానే విచారణకు హాజరుకాలేకపోయానని, తనను మన్నించాలని ఆయన కోర్టును వేడుకుంటూ పిటిషన్ సమర్పించారు.
అయితే సాయిరెడ్డి వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, నామినేషన్ల దాఖలుకు వెళుతున్నారుగా, కోర్టుకు రావడానికి వచ్చిన ఇబ్బందేమిటని కాస్త గట్టిగానే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణను సాయంత్రం దాకా వాయిదా వేసింది.
దీంతో పిటిషన్ను కోర్టు స్వీకరించి, తన నిర్ణయాన్ని వెలువరించేదాకా సాయిరెడ్డి కోర్టు హాలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే సమయంలో సాయిరెడ్డి పిటిషన్ను స్వీకరించిన కోర్టు అతనిపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ను ఉపసంహరించుకుంది.
అనంతరం ఆయన కోర్టు హాలు నుంచి బయటకు వచ్చారు. మంచి ముహుర్తంలో (సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య) ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలని భావించిన సాయిరెడ్డి మాత్రం కోర్టులో ఉన్న కారణంగా ఆ పత్రాన్ని అందుకోలేకపోయారు. ఈ నెల 6వ తేదీన విజయ సాయిరెడ్డి తన ధ్రువీకరణ పత్రాన్ని అందుకోనున్నారు.
మరోవైపు టీడీపీ తరుపున నామినేషన్లు వేసిన టీజీ వెంకటేశ్, సుజనా చౌదరిలు పలువురు టీడీపీ మంత్రులతో కలిసి వచ్చి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఇక రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేందుకే ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అసెంబ్లీకి వెళ్లి ధ్రువీకరణ పత్రాలను తీసుకున్నారు.
ఏపీ ప్రజలతు చేతనైనంత సేవ చేస్తా: కేంద్రమంత్రి సురేశ్ ప్రభు
రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైనమిక్ సీఎం అని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కితాబిచ్చారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఏపీ రాష్ట్రాభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని అన్నారు.
ఏపీ ప్రజలతు చేతనైనంత సేవ చేస్తా: కేంద్రమంత్రి సురేశ్ ప్రభు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తనకు చేతనైనంత సేవ చేస్తానని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా తాను శుక్రవారం తిరుమల వెళ్లి శ్రీవారి ఆశీర్వాదం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు సహా రైల్వే ఉన్నతాధికారులతో సమవేశమవుతానని, రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు.
హామీల అమలుకు కృషి చేస్తా: కేంద్ర మంత్రి సుజనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సహా ఇతర హామీల అమలయ్యేలా చేయడంలో కృషి చేస్తానని సుజనాచౌదరి స్పష్టం చేశారు.
ఏపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: టీజీ
తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టీజీ వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ఏపీ సమస్యలపై పోరాడుతానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ధ్రువీకరణ పత్రాలను అందుకున్న డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు
మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్దులుగా నామినేషన్లు దాఖలు చేసిన డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మరికాసేపట్లో వీరు ధ్రువీకరణ పత్రాలు అందుకోనున్నారు. కాగా, జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 రాజ్యసభ స్థానాలకు పోటీ జరగనున్న సంగతి తెలిసిందే.