4 రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ కింగ్: ఎవరీ నిక్కూ భాయ్?
హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగును నిర్వహిస్తున్న నిక్కూ భాయ్ అలియాస్ సత్యప్రసాద్ జిందాల్ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ నిర్వహించిన ఓ ఆపరేషన్లో అతను పట్టుబడ్డాడు. అయితే, అతన్ని పోలీసులు మొదట ఓ మామూలు బుక్కీగా భావించారు. కానీ, అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు.
అతనే నాలుగు రాష్ట్రాల్లో మ్యాచ్ బెట్టింగ్ సెషన్స్ గేమ్ను నడిపిస్తున్నాడనిి తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఒక్కో సెషన్కు రూ.300 కోట్ల బిజినెస్ చేసే నిక్కూను పట్టుకోవడంతో హైదరాబాద్ పోలీసులను కొనియాడుతున్నారు. బెట్టింగ్ మాఫియాలో అతను అతి కొద్ది కాలంలో కింగ్గా ఎదిగాడు. అతను మహారాష్ట్రకు చెందినవాడు.
రాజస్థాన్లో క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించిన నిక్కూ క్రమంగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు తన కార్యకలాపాలను విస్తరించాడని అంటున్నారు. నాలుగు రాష్ట్రాల్లో స్వయంగా బెట్టింగ్ సెషన్స్ గేమ్ ఆడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల్లో నిక్కూ భాయ్ నోటి వెంట వచ్చిన సంఖ్య భావ్ (బెట్టింగ్ ధర) అవుతుంది. దాని ఆధారంగానే బెట్టింగులు జరుగుతాయి.
హైదరాబాదులో నిక్కూ భాయ్ ముఠాకు పదమి మంది సబ్ బుక్కీలు, వేయి మంది పంటర్లు ఉన్నట్లు సమాచారం. హైదరాబాదులో బిజినెస్ రూ.30 కోట్ల దాకా ఉంటుందని అంచనా. నిక్కూకు క్రీడాకారులతో సంబంధాలున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.