పంతం.. నీదా?.. నాదా?.. 'సై': సైకిల్ గుర్తు కోసం తండ్రి-కొడుకుల వార్
సైకిల్ తన 'సిగ్నేచర్' అని, అది తనకే దక్కాలన్న తరహాలో ములాయం కామెంట్ చేశారు.
లక్నో: సమాజ్వాది పార్టీలో తండ్రి-కొడుకుల వైరం రోజురోజుకు ముదురుతూనే ఉంది. 'పంతం.. నీదా.. నాదా సై..' అన్న ఓ తెలుగు పాటను తలపించేలా ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోరు జరుగుతోందనడంలో అతిశయోక్తి లేదు.
అఖిలేష్ పై ములాయం బహిష్కరణ వేటు తర్వాత.. ఇద్దరు మళ్లీ కలిసిపోయామని ప్రకటించినా.. కొత్త విబేధాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ముఖ్యంగా పార్టీ పగ్గాలను తన నుంచి దూరం చేసి కొడుకుకు అప్పగించడం పట్ల ములాయం తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో విషయాన్ని ఢిల్లీలోనే తేల్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నిక చెల్లదని, పార్టీకి చెందిన సైకిల్ గుర్తు తనదేనని ములాయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నారు.
సైకిల్ నా 'సిగ్నేచర్': ములాయం..
అఖిలేష్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీలో వాలిపోయారు ములాయం. ఆయన వెంట సోదరుడు శివపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ లు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నాం ఈసీతో భేటీ ఖరారు కావడంతో.. అఖిలేష్ పై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేయనున్నారు.
'నేను ఎలాంటి అవినీతి లేదా మరే విధమైన తప్పులు చేయలేదు' అంటూ అభిప్రాయపడ్డ ములాయం.. సైకిల్ తన 'సిగ్నేచర్' అని, అది తనకే దక్కాలన్న తరహాలో కామెంట్ చేశారు.
ఆరోగ్యంపై దుష్ప్రచారం:
తన ఆరోగ్యంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ములాయం ఖండించారు. తాను ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. కాగా, తాను ఇంతవరకు ఎలాంటి పొరపాటు చేయలేదని, ఇప్పటికీ ప్రజల్లో తన పట్ల విశ్వాసం తగ్గలేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 5న నిర్వహించాలనుకున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టుగా శివపాల్ యాదవ్ ప్రకటించారు.
'సైకిల్' నాదంటే నాది..:
'సైకిల్' గుర్తు నాదంటే.. నాది.. అన్న తరహాలో తండ్రి-కొడుకులు పార్టీ గుర్తు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ములాయం సిద్దమవగా.. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారన్న సంగతి నిరూపించుకుని 'సైకిల్' గుర్తు తానే దక్కించుకోవాలని అఖిలేష్ భావిస్తున్నారు.
'సైకిల్' గుర్తు కోసం అఖిలేష్ ప్రయత్నాలు:
సైకిల్ గుర్తును ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతం తండ్రి-కొడుకుల్లో తీవ్రంగా ఉంది. దీంతో ఎవరి రాజకీయ ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇదే క్రమంలో సోమవారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలేష్ భేటీ కానున్నారు. పార్టీపై తనకున్న పట్టును ఈసీకి నిరూపించాలని అఖిలేష్ యోచిస్తున్నారు.
నెగ్గేది తండ్రా.. కొడుకా..?
సైకిల్ గుర్తు కోసం తండ్రి-కొడుకుల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరాటంలో.. ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈసీ నిర్ణయం పైనే ఇదంతా ఆధారపడి ఉండటంతో.. ఇద్దరిలో 'సైకిల్' గుర్తు ఎవరికి దక్కుతుంది? లేక ఈ ఇద్దరిలో ఎవరికీ కేటాయించకుండా ఈసీ ఝలక్ ఇస్తుందా? అన్నది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం.