దావూద్ కాళ్లు కుళ్లిపోయాయా?: 'లేదు ఫిట్గానే ఉన్నాడు'
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చావు బతుకుల్లో ఉన్నాడంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు తీవ్ర అనారోగ్యం బారినపడినట్లు సమాచారం. సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పారు.
కరాచీలోని క్లిఫ్టన్ పరిసరాల్లో ఉన్న తన నివాసంలో చికిత్స పొందుతున్న దావూద్ అసలు కదలలేకపోతున్నాడు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్ (శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉండటం వల్ల అతడు తిరిగి కోలుకునే అవకాశం లేదని తేల్చి చెప్పేశారట.
అధిక రక్తపోటు, మధుమేహం వల్ల అతడి రెండు కాళ్లకు రక్త సరఫరా సరిగా జరగడం లేదని, కాళ్లకు ఆక్సిజన్ అందక అక్కడున్న కణజాలం కుళ్లిపోతోందని వైద్యులు తేల్చారు. ఇప్పటికే అతడి కాళ్లలోని చాలా వరకూ కండరాలు పాడైపోయాయి. మరోవైపు గ్యాంగ్రీన్ వల్ల ఉత్పత్తి అయ్యే విష పదార్ధాలు దావూద్ శరీరమంతా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే గనుక జరిగితే దావూద్ కాళ్లను తొలగిస్తామని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఐఎస్ఐ నీడలో ఉండే దావూద్ను కరాచీ నుంచి బయటకు తీసుకెళ్లకూడదని నిర్ణయించారు. దీంతో కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు.
1993 ముంబై వరుస పేలుళ్ల విషయంలో దావూద్పై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దావూద్ ఇబ్రహీం ఆరోగ్యానికి సంబంధించి వచ్చిన వార్తలపై ఆయన అనుచరుడు, సన్నిహితుడు చోటా షకీల్ స్పందించారు. దావూద్ భాయ్ బలంగా ఉన్నారని డి కంపెనీ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆయన ఆరోగ్యం బాగాలేదని, చావుకు దగ్గర్లో ఉన్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని ఓ మీడియాకు తెలిపాడు. దావూద్ ఆరోగ్యంపై ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్కు ఎలాంటి ప్రాణముప్పు లేదని తేల్చి చెప్పాడు.
'మా గ్యాంగ్ స్టర్ దావూద్ చాలా ఫిట్గా ఉన్నారు. వ్యక్తిగత లాభంతో ఎవరో సృష్టించిన గందరగోళంతో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. మీ వార్తా సంస్థల వద్ద ఉంది తప్పుడు సమాచారం.' అని చెప్పాడు.