దీప ఎఫెక్ట్: మారిన శశికళ వ్యూహం
జయలలిత మేనకోడలు దీప రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో శశికళ ఆత్మరక్షణలో పడి, వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
చెన్నై: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు దివంగత నేత జయలలిత ప్రకటించడంతో చిన్నమ్మ, అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోంది. దాంతో ఆమె తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి కొంత కాలం వేచి చూడాలనే వ్యూహాన్ని ఆమె ఎంచుకున్నట్లు చెబుతున్నారు. దీంతో పన్నీరు సెల్వం పదవికి గండం తప్పింది.
పన్నీరు సెల్వంకు, శశికళకు మధ్య సయోధ్య లేదని, ఏ క్షణంలోనైనా శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవచ్చునని, ఆమె ఈ నెల 19 లేదా 27వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. అయితే, దీపా తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని మంగళవారంనాడు ప్రకటించారు. దీంతో శశికళ జాతకం మారిపోయింది.
దీపా ఎంట్రీ ప్రకటనతో పాటు జయలలితపై అనుమానాలు కూడా శశికళపై వ్యతిరేకతను పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు అన్నాడియంకె నాయకులు, సభ్యులు, కార్యకర్తలు నేరుగానో, వెనక నుంచో దీపను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కానీ, శశికళపై పెద్దగా తిరుగుబాటు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో శశికళ అచితూచి వ్యవహరించే వ్యూహాన్ని ఎంచుకున్నారు.
పన్నీరు సెల్వం సేఫ్ గేమ్...
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీరు సెల్వం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరికైనా విధేయతను ప్రకటించేందుకు వెనకాడబోరని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పన్నీరు సెల్వంకు శశికళ వర్గం పూర్తి మద్దతు ప్రకటిస్తూ బలం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. శశికళ భర్త నటరాజన్ ప్రకటన ఇందులో భాగంగానే వచ్చిందని అంటున్నారు. దీపా ఎంట్రీ కారణంగా పన్నీరు సెల్వం కూడా తన వ్యూహం మార్చినట్లు చెబుతున్నారు.
అధికారం మాత్రం శశికళదే..
పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అయినా అధికారం అంతా శశికళదేనని అంటున్నారు. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవరం కూడా ఇవ్వకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ప్రముఖులంతా శశికళతో భేటీ అవుతూ నేరుగానే వ్యవహారాలు నడుపుతున్నారు. అయితే, వ్యతిరేకత తలెత్తిన నేపథ్యంలో పన్నీరుసెల్వాన్ని మంచి చేసుకోవడం కోసం శశికళ భర్త ఎం.నటరాజన్ పన్నీరుకు మద్దతు ప్రకటిస్తూ ప్రసంగించారు.
బిజెపిపై నటరాజన్ ఆరోపణలు...
తమకు పన్నీరుసెల్వానికి మధ్య బిజెపి శక్తులే విభేదాలు సృష్టిస్తున్నాయని నటరాజన్ సోమవారం ఆరోపించారు. దానికి తోడు సమీకరణాల నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వెంటనే జరగక పోవచ్చునని కూడా నటరాజన్ ప్రకటనను బట్టి అర్థమవుోతంది. ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మంచి పాలనను అందిస్తున్నారని, అందువల్ల నాయకత్వాన్ని వెంటనే మార్చే అవసరం తమకు లేదని ఆయన చెప్పారు
పన్నీరు సెల్వం తన దారిలో తాను...
తాజా రాజకీయ పరిణామాలను పట్టించుకోనట్లుగానే పన్నీరుసెల్వం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. చెన్నై నగరానికి కృష్ణ నదీ జలాలు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి అమరావతికి వెళ్లారు. రాష్ట్రానికి కరవు సాయంగా రూ.39,565 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఇటువంటి తరుణంలో పన్నీరు సెల్వం చాప కింద నీరులా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
ఏమీ చెప్పకుండానే ఇలా..
శశికళకు విధేయంగా ఉండాలని కొంత మంది నాయకులు సూచిస్తూ, శశికళను ముఖ్యమంత్రి చేయడానికి కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నా పన్నీరు సెల్వం ఏమీ మాట్లాడడం లేదు. అయితే, ప్రజల్లోనూ, పార్టీలోనూ తనదైన ఒక బలమైన వర్గాన్ని పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. దీప కారణంగా శశికళ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉండే అవకాశం ఉందని, అలా ఉన్నంత కాలం పన్నీరు సెల్వం పదవికి ఢోకా లేదని భావిస్తున్నారు.