గొంతు పెంచిన శశికళ: ఎలా ఎదురు తిరిగింది...
తమిళనాట రాజకీయం గంటకో మలుపు తిరుగుతోంది. సమీకరణాలు మారుతున్నాయ్. శశికళ శిబిరం తడబడుతుండగా పన్నీర్ సెల్వం బలపడుతున్నారు.
చెన్నై: తమిళనాట రాజకీయం గంటకో మలుపు తిరుగుతోంది. సమీకరణాలు మారుతున్నాయ్. శశికళ శిబిరం తడబడుతుండగా పన్నీర్ సెల్వం బలపడుతున్నారు. పరిస్థితులు విషమిస్తున్నా కొద్దీ శశికళలో పెరుగుతున్న ఉక్రోశం తప్పిదాలకు దారి తీస్తున్నది. తన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించే విషయంలో తాత్సారం చేయడంలో కుట్ర దాగి ఉన్నదని ఆమె అనుమానించారు.
తమ పార్టీని చీల్చేందుకే ఆ కుట్ర పన్నారని ఆరోపించారు. 'వెంటనే తేల్చకపోతే మా ఆందోళన పద్ధతి మారుతుంది' అని గవర్నర్కు హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం కొత్త పంథాలో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్ర డిజిపి, చెన్నై నగర పోలీస్ కమిషనర్ అప్రమత్తం అయ్యారు.
పెరుగుతున్న పన్నీర్ బలం
రోజులు గడుస్తున్నా కొద్దీ పన్నీర్ బలం పెరుగుతున్నది. పన్నీర్కు అనుకూలంగా ప్రజావాణి అంతకంతకు ఎక్కువవుతున్నది. ఫలితంగా శశికళ కొత్త రాజకీయ వ్యూహాలకు తెరలేపుతున్నట్లు సమాచారం. ఏకంగా సీఎం అభ్యర్థిత్వంపైనే రాజీపడ్డ శశికళ తన నమ్మినబంటు కేఏ సెంగోట్టయ్యన్ పేరు ముందుకు తెచ్చారు. అందుకు ఎమ్మెల్యేలు 'ససేమిరా' అన్నట్లు సమాచారం. సంఖ్యాపరంగా ఎమ్మెల్యేలు శశి శిబిరంలోనే ఎక్కువగా ఉన్నారు. కానీ అంతా తనకు వ్యతిరేకంగా సాగుతున్న తీరు ఆమెలో ఆందోళనను రేకెత్తిస్తోంది.
మరొకరంటే పూర్తిగా పరిస్థితి తారుమారు
దీంతో సీఎం రేసు నుంచి తప్పుకొంటానని శశికళ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలతోనూ మాట్లాడినప్పుడు 'మీరు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది. మరొకరిని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అసలుకే మోసం వస్తుంది. అత్యధికులు పన్నీర్ గూటికి చేరిపోతారు' అని శాసనసభ్యులు పరోక్ష హెచ్చరికలు జారీచేశారని తెలియ వస్తున్నది. 'నేనే స్వయంగా సెంగోట్టయ్యన్ పేరు ప్రతిపాదిస్తున్నాఎందుకు వ్యతిరేకత వస్తుంది!'' అని శశికళ ప్రశ్నిస్తే 'ఎమ్మెల్యేల్లో పన్నీర్ పట్ల వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కేవలం మీరు సీఎం కావాలన్న ఉద్దేశంతోనే నిలబడ్డాం. మరొకరంటే ఇతర ఎమ్మెల్యేలు మాట వినకపోవచ్చు' అని సవివరంగా చెప్పినట్లు సమాచారం. ఇంత జరిగాక వెనుకడుగు వేస్తే నవ్వుల పాలవుతామని శశికళకు ఆమె భర్త నటరాజన నచ్చచెప్పినట్లు సమాచారం. పన్నీర్నే కొనసాగించి ఉంటే బాగుండేదని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
అందరి దృష్టి రాజ్భవన్ పైనే
క్షణక్షణానికి మారిపోతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరి దృష్టి రాజ్భవన్పైనే కేంద్రీకృతమైంది. పరిస్థితులు శశికళకు వ్యతిరేకంగానే ఉన్నాయని గవర్నర్కు న్యాయ, రాజ్యాంగ నిపుణుల సలహాలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్కు శశికళ లేఖ రాయడంతో రాజ్భవనకు భారీ భద్రత కల్పించారు. ఎమ్మెల్యేలతో బల ప్రదర్శనకు అపాయింట్ మెంట్ కోరిన శశికళ ఆ వెంటనే కూవత్తూరులో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ కావడంతో ఆమె ఏ క్షణంలోనైనా రాజ్భవనకు రావచ్చని పోలీసులు భావించారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే శశికళ వచ్చి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ వద్ద రోడ్డుపై నిరసనకు దిగుతారన్న అనుమానంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
రోజులు గడుస్తున్నా కొద్దీ ప్రతికూలం
నల్లేరుపై నడకలా సాగిపోతుందని భావిస్తే.. రోజులు గడుస్తున్నా కొలిక్కిరాలేదు. అంతా అనుకున్నట్లు జరిగుంటే శశికళ రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టేవారు. కానీ అలా జరగలేదు. పన్నీర్ మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద ధ్యాన దీక్ష చేసిన తర్వాత తిరుగుబావుటా ఎగురేయడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. 33 ఏళ్లుగా పెంచుకుంటూ వచ్చిన ఆశలు కుప్పకూలాయి. సరైన వ్యూహం లేకపోగా, లోపించిన పారదర్శకత, అనుభవ లేమి, దూకుడుగా వ్యవహరించడమే దీనికి కారణమని తెలుస్తోంది.
పారదర్శకతకు తావివ్వని శశి
శశికళ జీవితంలో తొలి నుంచి పారదర్శకత లేదు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పటి నుంచి అంతా రహస్యమే. ఆమెకు అందిస్తున్న వైద్యం విషయం బయటకు రాకుండా చూసుకున్నారు. కుటుంబసభ్యులు, పార్టీ నేతలు ఆసుపత్రి వద్దకు రాకుండా చూసుకున్నారు. జయ అనారోగ్యంపై పార్టీ తరపున కానీ, అమ్మ తరుపున కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో జయలలిత మరణంపై న్యాయమూర్తులే అనుమానం వ్యక్తం చేశారంటే.. కారణం జయ విషయంలో శశికళ వ్యవహరించిన తీరే కారణంగా తెలుస్తోంది. అమ్మ వైద్యం విషయంలో గోప్యత పాటించి ప్రజల్లో అనుమానాలు సృష్టించారు. జయ మరణానికి కొన్ని గంటల ముందు ఎమ్మెల్యేలతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడం వంటి చర్యలు ఆమె పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి.
రాజకీయాల్లో ఓపిక కావాలి
శశికళ తొందరపాటే ఆమె కొంప ముంచుతోంది. రాజకీయాల్లో ఓపిక చాలా ముఖ్యం. అధికారం కోసం గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు సహనంగా ఉండే ఆలోచన ఆమెలో కనిపించడం లేదు. జయలలితలా ఆకుపచ్చ చీర కట్టుకుని, జయలలితలా అయిపోతానని అనుకోవడం అనాలోచిత చర్య. పార్టీ ప్రధాన కార్యదర్శి కాగానే సీఎం పీఠంపై కూర్చుండిపోవాలని తహతహాలాడారు.
శశికళ. చిన్నమ్మ సీఎం అంటూ తన అనుచరులతో లేఖ రాయించుకున్నారు. సీఎం సీటు కోసం ఆమె వేసిన ఎత్తుగడ బాగానే ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొనే అంశాలపై స్పష్టత లేకపోవడం ప్రధాన వ్యూహాత్మక తప్పిదాల్లో ఒకటి.పన్నీరు సెల్వంతో రాజీనామా చేసించి శాసనసభాపక్షనేతగా తాను ఎన్నికైతే ప్రమాణాస్వీకారం చేయచ్చేనే భావించారే తప్ప పార్టీలో చీలిక వచ్చిన పన్నీర్ ఎదురు తిరిగినా, మరో సమస్య వచ్చిన దానిపై ఎలా వ్యవహరించాలన్న విషయం పైనా స్పష్టత కొరవడింది.
పన్నీరు తిరుగుబావుటా ఎగరేయగానే తెల్లజండా చూపించి సెల్వంతో రాజీ పడి ఉంటే శశికళ పరిస్థితి మరోలా ఉండేది. పన్నీర్ కు దన్నుగా ఇటు ప్రతిపక్షం.. అటు కేంద్రం ఉన్నాయని తెలిసినా మొండిగా.. బలవంతంగా తెగే వరకు లాగారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.