మోడీ నోట్ల రద్దు ప్రకటన: ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
ఒక్కసారి ఆరోజు రాత్రి ఏం జరిగిందో పరిశీలించినట్లయితే.. దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకుల అధిపతులు, ఎండీలకు ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపొచ్చింది.. నవంబర్ 8, సాయంత్రం 7 గంటల ను
ముంబై: దేశంలో నవంబర్ 8 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఆరోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం ప్రకటించారు. నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందు కోసం ప్రధాని.. రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు నవంబర్ 8 అర్ధరాత్రి(నవంబర్ 9ఉదయం) నుంచే అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. ప్రధాని సంచలన నిర్ణయంతో దేశం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నల్లకుబేరులు జాగ్రత్తపడే అవకాశం ఉండటంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని గంటల్లోనే అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఒక్కసారి ఆరోజు రాత్రి ఏం జరిగిందో పరిశీలించినట్లయితే.. దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకుల అధిపతులు, ఎండీలకు ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపొచ్చింది.. నవంబర్ 8, సాయంత్రం 7 గంటల నుంచి మీటింగ్ ఉంటుందని చెప్పింది. సాధారణంగా మీటింగ్ ఎజెండా అంశాలను తెలియపర్చడంతోపాటు ఆ మేరకు ప్రపేర్ అయి రావాలని ఆర్బీఐ సూచిస్తుంది. కానీ, ఆ వేళ ఎందుకోగానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.
ఆర్బీఐ చెప్పిన సమయానికి టాప్ బ్యాంకర్లందరూ మింట్ స్ట్రీట్లోని ఆఫీసుకు చేరుకున్నారు. మీటింగ్ మొదలైంది. మొదట ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఒకరు మాట్లాడారు. బ్యాంకులకు సంబంధించిన నిరర్థక ఆస్తులను ఏం చేద్దామని అందరినీ అడిగారు. ఎవరికివారు తమ ఆలోచనల్ని చెబుతున్నారు.
ఇంతలోనే టైమ్8 గంటలైంది. ఆర్బీఐ అధికారి ఒకరు సీట్లో నుంచి లేచి, ఆ గదిలోని టీవీలను ఆన్ చేస్తూ.. 'ఫ్రెండ్స్.. పీఎం మాట్లాడిన తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం'అన్నారు. ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం మొదలైంది..
నల్లధనం, నకిలీ కరెన్సీలపై కొద్దిసేపు మాట్లాడిన మోడీ.. చివరికి 'ఈ రోజు అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నాం' అని సంచలన ప్రకటన చేశారు. అంతే, ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. దాదాపు 40 నిమిషాలు సాగిన మోడీ ప్రసంగాన్ని అంతా ఆసక్తిగా విన్నారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన వెంటనే చిన్నపాటి కలకలం.. 'ఏమిటీ సర్ప్రైజ్..!'అని కొందరు బైటికి అనేశారట.
కాగా, నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన మోడీ సర్కార్.. చివరి నిమిషం దాకా కనీసం బ్యాంకర్లకు కూడా ఆ విషయం చెప్పలేదని, లైవ్ చూసిన తర్వాత చిన్నపాటి షాక్ తగిలినట్లయిందని ఆ సమావేశంలో పాల్గొన్న బ్యాంకర్ ఒకరు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరెవర్ని అలర్ట్ చెయ్యాలి? అర్ధరాత్రిలోగా దేశంలోని అన్ని ఏటీఎంలకు తాళం వేయించడం ఎలా?.. లాంటి తక్షణ సందేహాలను నివృత్తి చేసుకున్న బ్యాంకర్లు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో కొందరు కార్యాలయాల్లో అత్యవసర మీటింగ్స్ నిర్వహిస్తే, మరి కొందరు బ్యాంకర్లు ఇళ్లవద్దకే అధికారుల్ని పిలిపించుకుని చర్చలు జరిపారు.
నవంబర్ 8న రాత్రి 9:15కు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ కొత్త నోట్ల నమూనాను విడుదలచేశారు. నాటి సమావేశాన్ని గురించి ఎస్బీఐ చీఫ్ అరుంధతి ఇలా చెప్పారు. 'ప్రభుత్వ నిర్ణయం మొదట విస్మయం కలిగించినా, తదుపరి ఏం చెయ్యాలనేదానిపై దృష్టిసారించాం. రాత్రికిరాత్రే ఏటీఎంలను మూయించాం. రెండు రోజుల్లో కొత్త నోట్లు వచ్చేలా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాలనుకున్నాం. సిబ్బంది కొరత కారణంగా ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆ పని చేయాలనుకున్నాం' అని ఆమె వివరించారు.
ఇది ఇలా ఉండగా, నవంబర్8 నిర్ణయంతో రద్దైన పాత నోట్ల స్థానంలో కొత్త కరెన్సీని మార్చుకునే ప్రక్రియ గత 11 రోజుల నుంచి సాగుతూనే ఉంది. అయినా ప్రజల అవసరాలకు తగిన డబ్బులు అందడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
మోడీ నిర్ణయం మంచిదే అయినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం ముందుగా అంచనా వేయలేకపోయిందని, అందువల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చిపడుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా పెద్ద మొత్తం చిన్న నోట్లను విడుదల చేసి సామాన్యుని అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తే బాగుంటుందని, లేదంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.