నామాకు నో: టిడిపి ఎంపీల్లో 'పెప్పర్ స్ప్రే' చిచ్చు
నామా నాగేశ్వరరావు ఇకపై తమ నాయకుడుకాదని, ఆయన్ని తొలగించాలని కోరుతూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నామా పార్లమెంటులో తనను కొట్టినట్టు బాబుకు ఫిర్యాదు చేశారు. తామెవరినీ కొట్టలేదని, తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని ప్రతిఘటించినట్టు నామా చెబుతున్నారు. పార్లమెంటులో కొనకళ్ల నారాయణ కిందపడిపోయి విలవిల్లాడుతుంటే సీమాంధ్ర ఎంపీలు ఒక్కరూ పట్టించుకోలేదని, చివరకు తెలంగాణకు చెందిన తాను, రమేష్ రాథోడ్ కేవలం ఎనిమిది నిమిషాల్లో ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
టిడిపిలో తెలంగాణ, సీమాంధ్ర పేరుతో నాయకులు గత కొంతకాలంగా తమతమ ప్రాంతాలకు అనుగుణంగా స్పందిస్తున్నా, తీవ్రస్థాయిలో రెండు ప్రాంతాల నాయకుల మధ్య ఎప్పుడూ విభేదాలు ఏర్పడలేదు. స్వయంగా రెండు ప్రాంతాల వారితో బాబు ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించి ఇరుప్రాంతాల కార్యక్రమాల గురించి ఆయనే ఆదేశించేవారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు నాయకత్వంలో తెలంగాణ ఫోరంను, సీమాంధ్ర ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాస్ నాయకత్వంలో ఫోరం ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. ఎర్రబెల్లి, పయ్యావుల కేశవ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇప్పుడు నామాను తాము నాయకుడిగా గుర్తించమని, ఆయనను తొలగించాలని మోదుగుల ఫిర్యాదు చేయడం గమనార్హం. దీనిపై నామా స్పందిస్తూ తెలంగాణ ఏర్పడే సమయంలో ఇవన్నీ చిన్న అంశాలని, పదవుల్లో నియమించేది చంద్రబాబన్నారు. తాను మోదుగులను కొట్టలేదని తెలిపారు. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రెను ఉపయోగించడంతో కళ్లుమండి ఎవరేం చేస్తున్నారో అర్ధం కాలేదని, ఆ సమయంలో తామే కాదు పెప్పర్ స్ప్రేతో బాధపడ్డ వారంతా లగడపాటిని కొట్టారని ఆయన తెలిపారు.
ఈ సమయంలో గుండెపోటు వచ్చి ఎంపి కొనకళ్ల సీమాంధ్ర ఎంపిలున్న చోటే పడిపోయి కొట్టుకుంటుంటే ఒక్కరు కూడా స్పందించలేదని, తాను, రమేష్ రాథోడ్ ఇద్దరం కలిసి ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్టు తెలిపారు. గతంలో పార్లమెంటులో తెలంగాణ ఎంపిలు తెలంగాణ ఏర్పాటు కోసం ఆందోళన చేస్తున్నప్పుడు రమేష్ రాథోడ్ వెల్ లోకి వెళ్లిన సమయంలో నామా తన స్థానంలోనే ఉన్నారు. పైగా వెల్లోకి వెళ్లవద్దని రాథోడ్ను నామా వెనక్కి గుంజిన సందర్భాలూ ఉన్నాయి.
అలాంటి నామానే చివరకు బిల్లు పెట్టిన రోజు సీమాంధ్ర ఎంపీని కొట్టాడంటే ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాగా, మోదుగుల ఫిర్యాదును చంద్రబాబు పరిశీలించే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితిలో ఏ ప్రాంతం నాయకుల పైన కూడా చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం లేదని పార్టీ నాయకులు తెలిపారు.