బాబుకు డిఎల్ షాక్: చిరుకు కన్నబాబు, జగన్వైపు!
హైదరాబాద్: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. ఇటీవలే టిడిపి వైపు మొగ్గిన డిఎల్ తిరిగి సొంత గూడు కాంగ్రెసు పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. విభజన నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరాలని తొలుత భావించారు.
ఇటీవల అటా ఇటా అంటూ ఊగిసలాడారు. టిడిపి వైపు చూడటమే కాకుండా... కొంతకాలంగా కాంగ్రెస్ తీరుపై మనస్థాపంతో ఉన్న ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తన అనుచరులు టిడిపికి ఓట్లేసేలా మెప్పించారు.
టిడిపి నుంచి డిఎల్కు కడప లోకసభ టికెట్ ఇప్పించాలని ప్రయత్నాలు జరిగాయి. చివరకు టిడిపి ఆ స్థానాన్ని శ్రీనివాసులు రెడ్డికి కేటాయించడమే కాకుండా డిఎల్కు సరైన హామీ ఇవ్వలేదని తెలిసింది.
ఇదిలా ఉండగా... డిఎల్కు నచ్చజెప్పాలని, కాంగ్రెస్లోనే ఉండేలా చూడాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్కు సూచించడంతో అధిష్టానం పిలుపు మేరకు శనివారం సాయంత్రం డిఎల్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో కలిసి చర్చించారు. అనంతరం కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నట్లు తన వర్గానికి చెప్పారు. మైదుకూరు టిక్కెట్ను ఆయన భార్య సుభద్రమ్మకు అధిష్టానం ఇవ్వనుందని సమాచారం.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నేత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. కన్నబాబుతో జగన్ పార్టీ నేతలు ఈ మేరకు చర్చలు జరుపుతున్నారట. కన్నబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ పైన గెలిచారు. చిరు తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడంతో ఆయన కూడా ఆయన వెంట నడిచారు.