చిరంజీవి వైఫల్యంపై డిఎంకె వార్తాకథనం: రజనీకాంత్పై దొడ్డిదారి...
చెన్నై: రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సిద్ధపడిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె పరోక్ష యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తోంది. నేరుగా ఆయనపై దాడికి దిగలేక దొడ్డి దారిని వెతుక్కున్నట్లు కనిపిస్తోంది.
Recommended Video
రజనీకాంత్పై దాడికి డిఎంకె అధికార పత్రిక మురసోలి చిరంజీవి మీద పడింది. రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యాలను ఎత్తి చూపుతూ భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఇలా చిరంజీవిపై కథనం
గత శుక్రవారంనాటి సంచికలో చిరంజీవి రాజకీయ వైఫల్యాలపై డిఎంకె అధికార పత్రిక ఓ పూర్తి పేజీ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రజలు వచ్చినంత మాత్రాన రాజకీయాల్లో విజయం సాధిస్తామనేది నిజం కాదని చిరంజీవిని అడ్డు పెట్టుకుని వ్యాఖ్యానించింది.
రజనీకాంత్పై నేరుగా అనలేకనే...
రజనీకాంత్పై నేరుగా విమర్శలు చేయలేక చిరంజీవి రాజకీయ వైఫల్యాలపై ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఫొటోలు ప్రచురిస్తూ చిరంజీవి ఏలా రాజకీయాల్లో విఫలమయ్యారో ఆ వార్తాకథనం వివరించింది.
కరుణానిధితో రజనీకాంత్ భేటీ...
రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు రజనీకాంత్ చెబుతూ చేసిన ప్రసంగాల్లో డిఎంకెపై విమర్శలు చేయలేదు. అంతేకాకుండా, ఆయన డిఎంకె అధినేత కరుణానిధిని కలుసుకుని ఆశీర్వాదాలు కూడా పొందారు. భేటీ తర్వాత కరుణానిధిపై ఆయన మంచి మాటలు చెప్పారు కూడా. దీంతో రజనీకాంత్పై డిఎంకె ప్రత్యక్ష యుద్ధానికి దిగడానికి జంకుతున్నట్లు కనిపిస్తోంది.
అందుకే రజనీకాంత్పై...
జయలలిత మరణం తర్వాత అన్నాడియంకె ఛిన్నాభిన్నమైన స్థితిలో అధికారం తమకే దక్కుతుందని డిఎంకె గట్టిగా నమ్మినట్లు కనిపించింది. అయితే, రజనీకాంత్ పిడుగుపాటు లాంటి వార్త విసిరారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పడంతో డిఎంకె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రజనీకాంత్కు విశేషమైన అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి కూడా అలాంటి ఆదరణే ఉంది. అయినా ఆయన రాజకీయాల్లో విఫలమయ్యారని నేరుగా చెబుతూ రజనీకాంత్ కూడా విఫలమవుతారని పరోక్షంగా చెప్పడానికి డిఎంకె సిద్ధపడింది.