కొరియా ఎఫెక్ట్: చైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే: ట్రంప్
ఉత్తరకొరియాపై చైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో చైనా చర్యలను ఆయన ఎండగట్టారు.
వాషింగ్టన్: ఉత్తరకొరియాపై చైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో చైనా చర్యలను ఆయన ఎండగట్టారు. చైనా మౌనాన్ని చూస్తూ ఊరుకొనేది లేదని ఆయన హెచ్చరించారు.
ఉత్తరకొరియాపై చైనా తీరు చాలా దారుణంగా ఉందన్నారు. అంతేకాదు చైనా వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మా దేశంలో వ్యాపారం చేసి బిలియన్ డాలర్లు సంపాదించుకొనేందుకు గత అమెరికా నేతలు చైనాకు అనుమతిచ్చారు. కానీ చైనా మాత్రం ఒట్టిమాటలు చెప్పడం తప్ప మా కోసం ఏ మాత్రం పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు.
చైనా నిర్లక్ష్యధోరణిని చూస్తూ ఊరుకొనేది లేదన్నారు. ఉత్తరకొరియా సమస్యను చైనా చాలా సులువుగా పరిష్కరించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో చైనా తీరుపై ఆయన దుమ్మెత్తిపోశారు.
శుక్రవారం నాడు ఉత్తరకొరియా మరో ఖండాతర క్షిపణిని ప్రయోగించడంతో అమెరికా కోపానికి కారణమైంది. అమెరికాపై ఉత్తరకొరియా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ క్షిపణితో అమెరికా మొత్తం తమ గుప్పిట్లో ఉంటుందని ఉత్తరకొరియా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ తరహ క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించడం ఈ నెలలో ఇది రెండోసారి.దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉత్తరకొరియా చర్యలకు సరైన గుణపాఠం చెప్పాలని ట్రంప్ పదేపదే చైనాను కోరుతున్నారు. అయితే చైనా మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. దీంతో ట్రంప్ ఈ విషయంలో చైనా తీరును దుయ్యబట్టారు. చైనా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.