ఇకనైనా మేల్కొంటారా?: 'బోటు విషాదం' తర్వాత ఇవీ ప్రశ్నలు..
ఏ ప్రమాదమైనా సరే.. కొద్దిరోజులు హడావుడి చేసి ఆ తర్వాత అటకెక్కించేయడం గతంలో చాలాసార్లు జరిగిందే.
Recommended Video
విజయవాడ: కృష్ణా నది ప్రమాద ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. గత ప్రమాదాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. బోటు విషాదాలపై ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొనకపోతే.. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టే.
సుదీర్ఘ నదీ తీరం కలిగిన జిల్లాలో పర్యాటక సంస్థ అభివృద్ది చెందడం మంచిదే అయినప్పటికీ.. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం పర్యాటకుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదితో పాటు అంతర్వేది, యానాం నదిపై ఎన్నో బోట్లు తిరుగుతుంటాయి.
ప్రమాణాలు పాటిస్తున్నారా?:
గోదావరి నదిపై పాపికొండల ప్రాంతానికి పర్యాటకులను తీసుకెళ్లే బోట్లు కొన్నయితే.. మరికొన్ని ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులను తరలిస్తున్నాయి. అయితే వీటిల్లో చాలావరకు బోట్లు కనీస ప్రమాణాలను అటకెక్కిస్తుండటం ఆందోళన కలిగిస్తోన్న అంశం. జిల్లా అధికారులు కూడా వీటి నిర్వహణ పట్ల ఏమాత్రం దృష్టి సారించినట్టు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ప్రైవేటు బోట్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
గత ప్రమాదాలు:
నవంబర్ 18, 2012న పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి పాయలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో మత్స్యకార కుటుంబాలకు చెందిన 30మంది ప్రయాణిస్తున్నారు. 30మందితో వెళ్తున్న ఈ బోటు బోల్తా పడటంతో.. ఐదుగురు మహిళలు మృత్యువాత పడ్డారు.
గతేడాది జూన్, జూలై నెలల్లో బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజి నుంచి ఒకేసారి నీరు వదలడంతో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో తమ పొలాలకు బోట్లపై వెళ్తున్న వద్దిపర్రు, పేరవరం గ్రామాలకు చెందిన నలుగురు రైతులు దుర్మరణం చెందారు.
ప్రభుత్వం మేల్కొంటుందా?:
ఏ ప్రమాదమైనా సరే.. కొద్దిరోజులు హడావుడి చేసి ఆ తర్వాత అటకెక్కించేయడం గతంలో చాలాసార్లు జరిగిందే. తాజా బోటు ప్రమాదం పట్ల కూడా అధికారులు, ప్రభుత్వం అదే వైఖరిని అనుసరిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో ప్రస్తుతం పర్యాటకశాఖకు చెందిన బోట్లు పది లోపే ఉన్నట్టు తెలుస్తోంది. అదే ప్రైవేటు యాజమాన్యాల బోట్లు మాత్రం 75వరకు ఉన్నట్టు సమాచారం. వీటిల్లో భద్రతా ప్రమాణాలు ఎంతమేర ఉన్నాయన్నది ఎవరికీ తెలియదు. ఆ పర్యవేక్షణ కొరవడటం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంటుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధికారులు తనిఖీ చేస్తున్నారా?
జిల్లాలో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వరకూ, దిండి, కోరంగి, యానాం, ఎదుర్లలంక, కోటిపల్లి రేవుల్లో పడవలు తిరుగుతున్నాయి. పురుషోత్తపట్నం-పోలవరం, దేవీపట్నం-సింగన్నపల్లె, కొండమొదలు-శివగిరి మధ్య, కొండమొదలు-దేవీపట్నం మధ్య, మరికొన్ని గ్రామాలకు పడవలు తిరుగుతున్నాయి. ఇవిగాక మరో 200బోట్లను మత్స్యకారులు ఉపయోగిస్తున్నారు. వీటి భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ ఉందా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు.