ఆయనపై యోగి వేటు: గోరఖ్పూర్ ఘటనకు అతనే సంజీవని
కండ్లముందే కన్ను మూ స్తున్న పసికందులు.. చిన్నారులను చూసి అమ్మానాన్నల ఆర్తనాదాలు.. వింటుంటేనే హృదయం ద్రవించే పరిస్థితుల్లో కన్నవారి కడుపుకోతను చూసిన కఫీల్ అహ్మద్ ఎంతగా కుమిలి పోయి ఉంటాడో మరి.
గోరఖ్పూర్: కండ్లముందే కన్ను మూ స్తున్న పసికందులు.. చిన్నారులను చూసి అమ్మానాన్నల ఆర్తనాదాలు.. వింటుంటేనే హృదయం ద్రవించే పరిస్థితుల్లో కన్నవారి కడుపుకోతను చూసిన కఫీల్ అహ్మద్ ఎంతగా కుమిలి పోయి ఉంటాడో మరి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 70మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన గోరఖ్పూర్ దవాఖానలో పిల్లల విభాగం వైద్యుడు కఫీల్ అహ్మద్.. పసిప్రాణాలను కాపాడేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు. సొంత డబ్బు ఖర్చు చేసి మరీ పసి ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. కానీ ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఆయన ఒక ఫ్రాడ్ అన్న ముద్ర పడింది.
ఆక్సిజన్ కొరతతో భారీగా నవజాత శిశువుల మరణంతో విపక్షాల విమర్శల హోరు.. బాధితుల ఆక్రందనలతో తలబొప్పి కట్టిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తన కోపాన్ని పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ అహ్మద్ పై చూపింది. ఫ్రాడ్ అన్న పేరుతో బీఆర్డీ దవాఖాన పెడియాట్రిక్ విభాగం నోడల్ అధికారిగా ఉన్న డాక్టర్ కఫీల్ అహ్మద్ ను తొలగించి డాక్టర్ భూపేంద్ర శర్మను నియమించింది ఇదీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరు.
అర్థరాత్రి స్నేహితుల దవాఖానల నుంచి సిలిండర్ల తరలింపు
ఈ నెల 10 అర్ధరాత్రి.. గోరఖ్పూర్లోని బీఆర్డీ వైద్యకళాశాలలోని వార్డు నంబర్ -100లో మృత్యువు ఒక్కొక్కరినీ కబళిస్తున్న వేళ.. రాత్రి 2గంటల ప్రాంతంలో డాక్టర్ అహ్మద్కు దవాఖాన సిబ్బంది ఫోన్చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు మరో గంటలో ఆయిపోతాయని, పిల్లల పరిస్థితి ఏమిటో తమకు అర్థం కావడం లేదని నర్సులు ఆయనకు తెలిపారు. మెదడువాపుతో బాధపడుతున్న చిన్నారులకు నిరంతర ఆక్సిజన్ సరఫరా అవసరం. నర్సుల ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఇంటినుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన అహ్మద్ తన కారులో తెలిసిన మిత్రుడి దవాఖానకు వెళ్లాడు. అక్కడ నుంచి మూడు పెద్ద ఆక్సిజన్ సిలిండర్లను తన కారులో వేసుకుని బయల్దేరాడు. మూడుగంటలకల్లా శిశువైద్య విభాగానికి చేరుకుని, పిల్లలకు అమర్చారు. అయితే అక్కడ ఉన్న సుమారు 80మంది చిన్నారులకు ఆ సిల్లిండర్లు కేవలం అరగంటపాటు మాత్రమే ఆక్సిజన్ అందించగలిగాయి. తెల్లవారుజామున పరిస్థితి విషమించింది. ప్రాణవాయువు అందక చిన్నారులు తల్లడిల్లుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు వచ్చే పరిస్థితి లేదు. ఉన్నతాధికారులకు చెప్పి చేతులు ముడుచుకుని కూర్చోవచ్చు.
సొంత ఖర్చులతో ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు ఇలా
కానీ, కఫీల్ అహ్మద్ నిలబడలేదు. ఆ స్థితిలో తన జూనియర్ డాక్టర్లను పిలిచి పిల్లలకు చిన్న పంపుతో కూడిన అంబు బ్యాగ్లను ఉపయోగించి ఆక్సిజన్ పంపింగ్ చేయాలని ఆదేశించాడు. అదేసమయంలో సిలిండర్ల కాంట్రాక్టర్లకు వరుసగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఉదయం వరకు ఆక్సిజన్ సిలిండర్ల కోసం సమీపంలోని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు.. స్థానిక ఆక్సిజన్ సరఫరా దారు నుంచి నగదుపై ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు సిద్ధమని ఫోన్ కాల్ వచ్చే వరకు ఆయన ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చివరకు తన జూనియర్లలో ఒకరికి తన డెబిట్ కార్డు ఇచ్చేసి ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కు రావాలని కోరిన మంచి మనస్సున్న డాక్టర్.
కొన్ని గంటల పాటు ఇలా కఫీల్ అహ్మద్ ప్రయత్నాలు
తెల్లవారుజామున పట్టణంలోని పలు దవాఖానలకు వెళ్లిన కఫీల్ అహ్మద్ కొన్నిచోట్ల తన సంబంధాలను ఉపయోగించాడు. మరికొన్ని చోట్ల డబ్బులు ఖర్చుచేశాడు. మొత్తమ్మీద 12 సిలిండర్లను తీసుకుని తిరిగి దవాఖాన చేరాడు. వాటిని చిన్నారులకు అమర్చారు. ఈలోగా ఓ కాంట్రాక్టర్ ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడానికి తాను సిద్ధమేనని, అయితే తనకు నగదు రూపంలోనే డబ్బు తక్షణమే ఇవ్వాలని డాక్టర్ అహ్మద్కు ఫోన్చేశాడు. వెంటనే దవాఖాన ఫ్యూన్ ఒకరికి తన కార్డు ఇచ్చి వెళ్లి ఏటీఎం నుంచి పదివేలు విత్డ్రా చేసుకుని రమ్మన్నాడు. అయితే ఆ సిలిండర్లు కూడా కొన్నిగంటలపాటే ప్రాణాలు నిలుపగలిగాయి. చాలామంది ప్రాణాలు కాపాడగలిగినా, కండ్లముందే కొంతమంది పిల్లలు రాలిపోయారు. చేతిలో డబ్బులున్నా, ఆక్సిజన్ సిలిండర్లు లేవు. ప్రాణం పోసే వైద్యులున్నా, సమయం లేదు. ఇక తట్టుకోలేక కఫీల్ అహ్మద్ తన పీడియాట్రిక్వార్డు గోడకు జారగిలపడి ఏడ్చేశాడు. డాక్టర్ కఫీల్ అహ్మద్ దేవదూతలా పిల్లల ప్రాణాలు కాపాడాడని చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటే, ప్రభుత్వం మాత్రం పిల్లల మృతికి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయనపై చర్యలకు దిగింది. విధుల నుంచి తప్పించింది. ఇందుకు నాకు బాధలేదు. వీటన్నింటికన్నా పిల్లలందరిప్రాణాలూ కాపాడలేకపోయామనేదే తన బాధ అని డాక్టర్ అహ్మద్ తెలిపారు.
గోరఖ్పూర్కు ప్రాంతీయ పరిశోధనా కేంద్రం మంజూరు
ఉత్తర ప్రదేశ్లోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గత నెలలోనే నివేదిక ఇచ్చి హెచ్చ రించింది. దాదాపు 70మంది వరకు చిన్నారులను బలిగొన్న బీఆర్డీ దవాఖాన సహా మరో నాలుగు వైద్యకళాశాలల పరిస్థితి అధ్వాన స్థితిలో ఉందని నివేదికలో పేర్కొన్నది. బీఆర్డీ హాస్పిటల్లో వైద్యపరికరాల వినియోగం మూలన పడిందని, ఉపయోగించుకునేందుకు సరైన శిక్షణ కలిగిన సిబ్బంది లేకపోవడంతో పరికరాలు పనికిరాకుండా పోయాయి.
బీఆర్డీ దవాఖానలో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాగ్ సూచించింది. దవాఖానకు రావాల్సిన 27.38కోట్ల నిధులను కస్తూర్బాగాంధీ మెడికల్ యూనిట్ నిలిపివేయడంతో వైద్య వసతులు కొరవడుతున్నాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే పిల్లల వ్యాధులపై ప్రాంతీయ పరిశోధనాకేంద్రాన్ని గోరఖ్పూర్లో నెలకొల్పనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.85 కోట్లతో దీనిని నెలకొల్పుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఘటనపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నడ్డా, పరిస్థితిని సమీక్షించేందుకు ఓ వైద్యబృందాన్ని బీఆర్డీ వైద్యకళాశాలకు రప్పిస్తున్నట్లు వెల్లడించారు.
నిధుల కోసం మూడుసార్లు లేఖ రాశానన్న దవాఖాన చీఫ్ సూపరింటెండెంట్
తీవ్ర విమర్శల మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని బాబా రాఘవ్దాస్ వైద్యకళాశాలను ఆదివారం సందర్శించారు. వారంరోజుల వ్యవధిలో ఈ దవాఖానలో 70మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాతో కలిసి పరిస్థితిపై వైద్యులతో చర్చించిన సీఎం యోగి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. 48గంటల వ్యవధిలో 30మంది శిశువుల మృతి చెందడానికి మెదడువాపే కారణమని వైద్యులు గుర్తించారని చెప్పారు. పిల్లల మరణానికి ఆక్సిజన్ కొరతే కారణమన్న ఆరోపణలను ఆయన కొట్టివేశారు.
‘ఈ మధ్యకాలంలో ఈ దవాఖానకు నేను రావడం ఇది నాలుగోసారి. పరిస్థితులను చక్కదిద్దేందుకు చేయాల్సినంతా చేస్తున్నాం. ప్రభుత్వ ఉన్నతాధికారులను ఇక్కడే ఉంచాం. పిల్లల మరణాలపై నాకన్నా ఎక్కువగా బాధపడుతున్నవాళ్లెవరూ లేరు.' అని అన్నారు. ఇదిలా ఉంటే దవాఖాన నిర్వహణకు సరిపడా నిధులు ఇవ్వలేదని సస్పెండైన చీఫ్ సూపరింటెండెంట్ రాజీవ్మిశ్రా తెలిపారు. నిధులు లేవని, ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు ఇబ్బందిగా ఉన్నదని నేను జూలై3, జూలై 19, ఆగస్టు 1 తేదీల్లో ప్రభుత్వానికి లేఖరాశాను. ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఆగస్టు 5న ప్రభుత్వం నిధులు విడుదల చేయగా, 11న బిల్లులు చెల్లించాం అని రాజీవ్ మిశ్రా తెలిపారు. చిన్నారుల మరణాలు చోటుచేసుకుంటున్నప్పుడు రాజీవ్ మిశ్రా రిషికేశ్ యాత్రలో ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. అయితే తాను ప్రభుత్వం అనుమతించాకే సెలవులు తీసుకున్నానని మిశ్రా చెప్పారు.