ఐన్స్టీన్ సిద్ధాంతం నిజమైంది: ఖగోళ ప్రపంచంలో విప్లవం
వాషింగ్టన్: భౌతిక, ఖగోళ శాస్త్రాల్లో అద్భుతమైనదగ్గ ఆవిష్కరణ జరిగింది. విశ్వరహస్యాలను ఒడిసి పట్టుకునే దిశగా మానవుడు వేసిన పెద్ద అడుగుగా చెప్పవచ్చు. వందేళ్ల క్రితం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాలను.. ఇన్నాళ్లు ఊహగా మాత్రమే ఉన్న గురుత్వాకర్షక తరంగాలను (గ్రావిటేషనల్ వేవ్స్) అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది.
గురుత్వాకర్షక తరంగాలను ప్రత్యక్షంగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఖగోళ ప్రపంచంలో ఇది పెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. 130 కోట్ల ఏళ్ల క్రితం రెండు కృష్ణబిలాలు ఢీకొట్టుకోవడంతో కలిసిపోయిన రెండు భారీ ద్రవ్యరాశులు ముందుకు చలించి గత ఏడాది భూమికి చేరగా అత్యాధునిక పరికరాలతో వాటిని గుర్తించినట్లు పరిశోధకులు ప్రకటించారు.
అంతరిక్షం - కాలానికి సంబంధించిన ఈ తరంగాల్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ వందేళ్ల క్రితమే తన సాపేక్ష సిద్ధాంతంలో చెప్పారు. గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన సూక్ష్మ ప్రకంపనలను సైతం పసిగట్టేందుకు అమెరికాలో భూగర్భంలో అమర్చిన లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ(ఎల్ఐజీవో-లిగో)గా వ్యవహరించే రెండు డిటెక్టర్లు ఈ విషయాన్ని గుర్తించాయి.
130 కోట్ల సంవత్సరాల క్రితం రెండు కృష్ణబిలాలు ఢీకొట్టుకోవడంతో కలిసిపోయిన రెండు భారీ ద్రవ్యరాశులు ముందుకు చలించి అంతరిక్షం గుండా 2015 సెప్టెంబరు 14న భూమికి చేరగా అత్యాధునిక లిగో పరికరాలతో గుర్తించినట్లు పరిశోధకులు ప్రకటించారు. గుర్తించిన సదరు సమాచారాన్ని శాస్త్రవేత్తల పరిశీలనకు, నిపుణుల సమీక్షకు నెలలకొద్దీ సమయం పట్టింది.
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల బృందాల శ్రమ ఫలితంగా ఎట్టకేలకు గురువారం ప్రకటన వెలువడింది. 1916లో ఐన్స్టీన్ పేర్కొన్న మాదిరిగానే 2015లో తాము గమనించిన తరంగాలు ఉన్నట్లు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు, లిగో బృందం నేత డేవిడ్ షూమేకర్ పేర్కొన్నారు. ఇది పిచ్చుక శబ్దంలా ఉందనీ, 20లేదా 30హెర్ట్జ్ల తక్కువ ఫ్రీక్వెన్సీతో ప్రారంభమై, క్షణకాలంలో 150 హెర్ట్జ్ల దాకా వెళ్లిందన్నారు.
గురుత్వాకర్షక తరంగాలను గుర్తించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న భారతీయ శాస్త్రవేత్తల పాత్రను ప్రశంసించారు. ఈ సవాలులో భారతీయ శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్ర పోషించారని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.