చంద్రబాబును రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?
హైదరాబాద్: బుధవారం రాత్రి హఠాత్తుగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా... చంద్రబాబు, నారా లోకేష్లను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత పరిస్థితి పైన చాలామంది అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. పార్టీలో రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
రేవంత్ రెడ్డి కేవలం ఓటుకు నోటు కేసులో మాత్రమే నిందితుడు కాదని, తెలుగుదేశం పార్టీకి చెడ్డపేరు తీసుకు వచ్చారని ఆరోపించారు. ఆయన పైన ఉన్న క్రిమినల్ చర్యలతో టిడిపికి చెడు పేరు వచ్చిందన్నారు. అంతేకాదు, అతను చంద్రబాబును, లోకేష్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే అతనికి అంత ప్రాధాన్యత అన్నారు.
అదే సమయంలో.. చంద్రబాబు తెలంగాణ పైన దృష్టి సారించలేరని చెప్పారు. అతను ఏపీకి వెళ్లిన తర్వాత తెలంగాణ పైన దృష్టి తగ్గిందన్నారు. చంద్రబాబుకు తెలంగాణ పైన ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. తెలంగాణలో టిడిపికి చోటు లేదన్నారు. తెలంగాణలో ప్రాధాన్యత కోల్పోయిందన్నారు.
ప్రజలు ఇప్పుడు తెరాస వెంట ఉన్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ద్వారా మరోసారి అది తేలిపోయిందన్నారు. చంద్రబాబు చాలా మంచి వ్యక్తి అని, పార్టీని వీడటం తనకు చాలా బాధగానే ఉందని ఎర్రబెల్లి చెప్పారు. పార్టీని కాపాడలేకే తాను తెరాసలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు.