ఆదరణ తగ్గిన ఫేస్బుక్: హైదరాబాద్ను దాటిన విశాఖ
హైదరాబాద్: ఫేస్బుక్కు హైదరాబాద్ యువతలో ఆదరణ తగ్గిందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది 91 శాతం మంది ఫేస్బుక్ పైన ఆసక్తి చూపగా, ఈసారి అది 83 శాతం మాత్రమే ఉంది. ట్విట్టర్ను గత ఏడాది 47% మంది యువత దీనిని వినియోగించగా, ఇప్పుడు 42 శాతంగా ఉంది.
హైదరాబాద్లో శుక్రవారం విడుదలచేసిన టీసీఎస్ యూత్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 83% మంది వినియోగదారులతో ఫేస్బుక్ ముందుండగా, గూగుల్ ప్లస్ 74 శాతంతో రెండో స్థానంలో ఉంది. ట్విట్టర్42 శాతంతో మూడో స్థానంలో ఉంది.
గూగుల్ ప్లస్ను అమ్మాయిలు అధికంగా 78% మంది వినియోగిస్తున్నారు. వారిలో ఫేస్బుక్ వినియోగం 67 శాతంగా ఉంది. క్రీడాకారులను 59% మంది, ప్రముఖులను 52% మంది ట్విటర్లో అనుసరిస్తున్నారు. ఆసక్తికర విషయమేమంటే సినిమా తారలను ట్విట్టర్లో అనుసరిస్తున్న యువత 4 శాతమే.
తక్షణ సమాచారం చేరవేసేందుకు వ్యాట్సాప్ను హైదరాబాద్ టీనేజర్లు 66 శాతం మంది ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల 59 శాతం మంది, పుస్తకాలను 62 శాతం మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తుండటం విశేషం. సినిమా టిక్కెట్లను 55శాతం, ప్రయాణ టిక్కెట్లు 42 శాతం మంది కొంటున్నారు.
ప్రొఫెషనల్ కోర్సులను ఎంపిక చేసుకోవడంలోనూ అబ్బాయిలను వెనక్కి నెట్టేశారు. అబ్బాయిల కంటే (48% మంది), అమ్మాయిలు (61%) ఎక్కువగా ఈ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. వృత్తివిద్య కోర్సులు ఆదరణ కోల్పోతున్నాయనేది అపోహ మాత్రమేనని సర్వేలో వెల్లడైందని టీసీఎస్ ఉపాధ్యక్షులు రాజన్న చెప్పారు.
గచ్చిబౌలిలోని టీసీఎస్ ప్రాంగణంలోని శుక్రవారం ఆయన హైదరాబాద్ యూత్ సర్వేలోని అంశాలను మీడియాకు వెల్లడించారు. 12 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లల డిజిటల్ అలవాట్లను తెలుసుకునేందుకు 'జనరేషన్ జెడ్' పేరుతో ఈ సర్వే చేపట్టినట్లు ఆయన వివరించారు.
దేశంలోని 15 నగరాల్లో టీసీఎస్ ఐటీ విజ్ క్విజ్లో భాగంగా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్లో 100 పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారన్నారు. భవిష్యత్తు వృత్తినిపుణులైన టీనేజర్ల అలవాట్లను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా తాము నిర్వహిస్తున్న సర్వే దోహదపడుతుందన్నారు.
ఆన్లైన్ యుగంలోనూ పిల్లలు ఎక్కువమంది సంప్రదాయ మీడియా వైపే మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్లో వార్తల కోసం పత్రికలు, టీవీలు చూసేవారు 80 శాతం మంది ఉన్నారు. విశాఖపట్నంలో ఇది 84 శాతం. హైదరాబాద్లో 42% మంది సామాజిక మాధ్యమాలు, 41% మంది ఆన్లైన్ ద్వారా స్నేహితులతో సంప్రదిస్తుండగా, విశాఖలో అవి వరుసగా 33%, 27% నమోదయ్యాయి.
హైదరాబాద్లో 75% మంది రోజూ గంటైనా ఆన్లైన్లో గడుపుతున్నారు. 29% మంది పాఠశాల అసైన్మెంట్ను పూర్తి చేయడానికి ఉపయోగిస్తుంటే, అభిరుచులకు పదును పెట్టుకోవడానికి 19% మంది ఆన్లైన్లో ఉంటున్నారు.
ఆన్లైన్లో రోజు గంటసేపు గడిపే విషయంలో హైదరాబాద్ను విశాఖపట్నం మించిపోయింది. ఇక్కడ 77% మంది ఆన్లైన్లో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఫోన్కాల్స్, సామాజిక మాధ్యమాల్లో కంటే నేరుగా స్నేహితులతో మాట్లాడేందుకు హైదరాబాద్లో 38%, విశాఖలో 43% యువత ప్రాధాన్యమిస్తున్నారు.