ఇది కదా అసలు బాగోతం?: బతుకమ్మ చీరల 'డీలింగ్' వెనుక ఇంత జరిగిందా!..
ఒక్కో చీరకు రూ.160చొప్పున వెచ్చించి కొన్నామని అధికారులు అంటున్నారు. వాస్తవాలు మాత్రం చీర ఖరీదు ఒక్కో దానికి రూ.60 మించలేదనే తెలుస్తోంది.
Recommended Video
హైదరాబాద్: మంచికి పోతే చెడు ఎదురైందో.. లేక కక్కుర్తి తనానికి తగిన శాస్తి జరిగిందో తెలియదు కానీ బతుకమ్మ చీర టీఆర్ఎస్ పార్టీని కావాల్సినంత బద్నాం చేసింది. పండుగపూట సెంటిమెంటుతో కొడితే చాలు.. మహిళలంతా తమను ఆకాశానికెత్తేస్తారని భావించారు.
కానీ సీన్ పూర్తిగా బెడిసికొట్టింది. ఒకవిధంగా మహిళలంతా టీఆర్ఎస్ ను ఎత్తి కుదిశారు. నాసిరకం చీరలు అంటగట్టి.. టీవిల్లో, పేపర్లలో గొప్ప పనిచేశామంటూ డబ్బా కొట్టుకోవడం వారిని అగ్గి మీద గుగ్గిలం అయ్యేలా చేసింది. ఫలితంగా రోడ్డు మీద తగలబడ్డ చీరలు.. అధికార పార్టీకి శాపనార్థాలు.. మొత్తంగా ఒక ఫెయిల్యూర్ ను టీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంది.
టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
'పండుగ చేసుకో'..:
కూలీ కూడా విడిచిపెట్టి, పొద్దంతా ఎండలో మాడితే.. రూ.50 చీర ఇచ్చి 'పండుగ చేసుకో' అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం మహిళలకు అరికాలి మంట నెత్తికెక్కేలా చేసింది. సహజంగానే ఆ సమయంలో ఎవరైనా ఆవేశానికి లోనవుతారు. ఫలితంగా రోడ్ల మీద చీరలు తగలబడ్డాయి. ప్రభుత్వానికి గట్టిగా అక్షింతలు పడ్డాయి.
ఇంత జరిగినా:
ఇంత జరిగినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదు. మావైపు అసలు తప్పే లేదన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. పైగా చీరల తగలబెట్టినవాళ్ల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుండటం మరింత దారుణం. తప్పును సరిచేసుకోవాల్సిందిపోయి.. తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంది ఆ పార్టీ. ఒకరకంగా.. 'మారు మాట్లాడకుండా ఏదిస్తే అది తీసుకోండి.. ఎదురుతిరిగితే కేసులు తప్పవు' అన్న రీతిలో ప్రభుత్వ ధోరణి సాగుతోంది.
ఇంతకీ చీరల బాగోతం ఏంటి?
నిజానికి ఈ నాసిరకం చీరల బాగోతం అంతా పార్టీ నేతల చలవే. జనం ఏదిచ్చినా తీసుకుంటారన్న ఉద్దేశంతో దారుణమైన కక్కుర్తికి పాల్పడ్డారు. బతుకమ్మ చీరల కొనుగోళ్ల కోసం కొంతమంది నేతలు 10రోజుల క్రితం హైదరాబాద్ లోని మదీనాకు వెళ్లారు.
మదీనా మార్కెట్లో ఓ పేరున్న వ్యాపారిని సంప్రదించి.. రూ.50 ధరలో ఎక్కువ చీరలు కావాలని అడిగారు. అంత తక్కువ ధరకు చీరల సప్లై కుదరదని సదరు వ్యాపారి బదులివ్వడంతో అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీఎస్టీ ఉన్నందున అంత తక్కువ కుదరదని అతను తెగేసి చెప్పాడు.
హోల్సేల్ వ్యాపారులతో:
నువ్వెలాగు కుదరదంటున్నావు కాబట్టి.. పోనీ నీకు తెలిసిన హోల్ సేల్ వ్యాపారులతోనైనా మాట్లాడించు అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రాధేయపడ్డారు. దీంతో అతను కొంతమంది హోల్ సేల్ వ్యాపారులను పిలిపించినా.. ఇక్కడ కూడా బేరం వర్కౌట్ కాలేదు. అంత తక్కువ ధరకు చీరల సప్లై కుదరదని తేల్చేశారు. అయితే తమకు చీరలు సప్లై చేసే గుజరాత్ ఏజెంట్స్ ను సంప్రదించమని వారు సలహా ఇచ్చారు.
సిట్టింగ్.. డీల్..:
నేతల ఒత్తిడితో ఓ ఏజెంట్ తో మాట్లాడి సదరు వ్యాపారి సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. జీఎస్టీ లేకుండా రూ.50, రూ.60లు పలికే చీరలు సప్లై చేసేందుకు ఇక్కడ డీల్ కుదిరింది. ఏజెంట్లు చెప్పిన విధంగా సూరత్ కు చెందిన కొన్ని కంపెనీలతో మాట్లాడి నేరుగా డీలింగ్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం వారం రోజుల క్రితం గుజరాత్ నుంచి చీరలు రాష్ట్రానికి వచ్చాయి. చీరల బండిళ్లను జహీరాబాద్ శివారులోని ఓ గోడౌన్ లో స్టోర్ చేశారు.
ఇలా తెలిసింది:
గోడౌన్ లో స్టోర్ చేసిన చీరలను ఏ ఒక్క నాయకుడు కానీ ఇతరత్రా అధికారులు కానీ పరిశీలించిన పాపాన పోలేదు. వచ్చినవి వచ్చినట్లు ఆయా గ్రామాలకు సప్లై చేశారు. ఆపై మహిళలంతా ఈ నాసిరకం చీరలపై భగ్గుమనడంతో టీఆర్ఎస్ పరువు గంగపాలైంది. దీనిపై కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటుండగా.. అది కాస్త నవతెలంగాణకు తెలియడంతో.. ఈ విషయాలన్ని వెలుగులోకి వచ్చాయి.