టైటానియం స్కాం: రుజువైతే కెవిపికి 20 ఏళ్ల జైలు
టైటానియం కుంభకోణంలో అమెరికాలో నమోదైన నేరాభియోగాలు నిరూపమితమైతే ఎంపి కెవిపి రామచంద్ర రావుకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందట. కెవిపి ప్రొవిజినల్ అరెస్టు కోరుతూ ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందట. సిబిఐ పంపిన రెడ్ కార్నర్ నోటీసులు అందలేదని ఎపి సిఐడి అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సిబిఐ అధికారులు నోటీసు విషయాలను చెప్పారు.
ఇంటర్పోల్ సిపిఐకి పంపిన రెడ్ నోటీసులో కెవిపి ఫొటోతో సహా ఆయన పూర్తి వివరాలు ఉన్నాయి. పేరు, తల్లిదండ్రుల పేర్లు, హైదరాబాద్లో చిరునామా, పాస్పోస్టు వివరాలు పొందుపరిచారు. ఇల్లినాయిస్లోని ఉత్తర ప్రాంత జిల్లా కోర్టులో 2006 జనవరి 1వ తేదీ నుంచి గత ఏడాది జూన్ 20వ తేదీ వరకు కేసులో విచారణ జరిగింది. 'ముడుపుల కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన నిందితుడిగా కెవిపిని సంభోదించింది.
కెవిపిపై ఎఫ్బీఐ ప్రధానంగా నాలుగు అభియోగాలు మోపింది. 1 టైటానియం కుంభకోణంలో కుట్రను నడపడం, 2 మనీ లాండరింగ్, 3 కుట్ర కోసం అంతర్జాతీయ ప్రయాణం, 4 కుంభకోణ కుట్రకు సహకరించడం. ఒక్కో అభియోగం రుజువైతే కనిష్ఠంగా ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. రెడ్ నోటీసుపై తగిన చర్యలు తీసుకుని నేషనల్ సెంట్రల్ బ్యూరో (వాషింగ్టన్), ఇంటర్పోల్ సెక్రటేరియట్కు సమాచారం ఇవ్వాల్సిందిగా సిబిఐని కోరారు.
కెవిపి వ్యవహారంపై కేంద్రమంత్రి ఆనంద్ శర్మ మాట్లాడారు. ఈ అంశంపై కెవిపియే సమాధానం చెబుతారన్నారు. ఆయన పైన బాధ్యత ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని తెలిపారు. కాగా ఈ అరెస్టు వారెంటుకు కాలపరిమితి లేదంటున్నారు. మరోవైపు కెవిపి అరెస్టుకు కేంద్రంలో అడ్డుపడుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. పద్ధతి ప్రకారం లేదనే వాదనను ముందుకు తెచ్చారట. పరారీలో ఉంటేనే అరెస్టుకు అవకాశమని చెబుతున్నారట.