మన్మోహన్ మాట ఎందుకు మార్చారంటే: దుమ్ముదులిపిన మోడీ
కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే వారి పార్టీనే ముఖ్యమని, కానీ మనకు మాత్రం పార్టీ కంటే దేశం గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే వారి పార్టీనే ముఖ్యమని, కానీ మనకు మాత్రం పార్టీ కంటే దేశం గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు అన్నారు. అవినీతికి మద్దతుగా విపక్షాలు జట్టు కట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అన్నారు.
గతంలో అధికార పార్టీ చేసే స్కాములు, ప్రభుత్వ అవినీతి పైన ప్రతిపక్షాలు పోరాడేవని, ఇప్పుడు ప్రతిపక్షాలు అవినీతికి మద్దతిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను ఎగవేత పైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట మార్చారన్నారు. సైద్ధాంతికంగా వామపక్షాలు రాజీపడ్డాయన్నారు.
పెద్ద నోట్ల రద్దును దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. త్వరలో బినామీ ఆస్తుల చట్టం తీసుకు వస్తామని తెలిపారు. పక్కా వ్యూహంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని మోడీ చెప్పారు.
మనకు దేశ ప్రయోజనాలే
దేశ ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని, బీజేపీకి మాత్రం దేశం ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి ప్రియురాలన్నారు. వామపక్షాలు కాంగ్రెస్ వైపు చేరి వాటి సిద్ధాంతం పట్ల రాజీ పడుతున్నాయన్నారు. వామపక్షాలకు చెందిన దివంగత నేతలు జ్యోతిర్మయ్ బసు, హరికిషన్ సింగ్ సుర్జిత్లు పెద్ద నోట్ల రద్దుకు మద్దతుగా మాట్లాడారన్నారు.
మన్మోహన్ మాట మార్చారు
భాజపా పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి మోడీ శుక్రవారం మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రధాని విమర్శించారు. 1991లో ఆయన పన్ను ఎగవేతదారులను ఉద్దేశించి కఠినంగా మాట్లాడారన్నారు. ఇప్పుడు ఆయన మాట పూర్తిగా మార్చేశారన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీయే ముఖ్యం కాబట్టి మాట మార్చారన్నారు. ఆయన ఆలోచన దేశం గురించి కాదన్నారు.
అవినీతిపై ఏకతాటిపైకి విపక్షాలు
నల్లధనానికి వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా మోడీ ప్రస్తావించారు. మన దేశంలో పార్లమెంట్ కార్యకలాపాలు అడ్డుకోవడం గతంలోనూ జరిగిందని, ఈసారి మరికొంత ఎక్కువ కాలం ఈ పని చేస్తున్నారని, కానీ ఓ ప్రధాన తేడా ఉందని, గతంలో అంతరాయాలకు కారణం భారీ ఎత్తున కుంభకోణాలు, అవినీతి అన్నారు. కానీ ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అధికార పక్షం చర్య తీసుకోగా అవినీతిపరులకు మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చాయన్నారు.
నితీష్, పట్నాయక్కు మోడీ థ్యాంక్స్
బీజేపీతే సైద్ధాంతిక విభేదాలున్నా పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. నల్లధనానికి వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పెద్ద నోట్ల రద్దు ఒక ముఖ్యమైన చర్య అని, ఇదే చివరి గమ్యం కాదని స్పష్టం చేశారు.