విజయకాంత్కు పెరుగుతున్న సపోర్ట్: జీకే వాసన్ చేరిక
చెన్నై: తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం ప్రజా సంక్షేమ కూటమితో చేతులు కలిపి డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ అందర్నీ ఆశ్చర్యపరచగా.. తాజాగా అదేరీతిలో జీకే వాసన్ మరో అనూహ్య మలుపునకు కారణమయ్యారు.
ప్రస్తుత ఎన్నికల్లో మూడో అతిపెద్ద కూటమిగా ఉన్న కెప్టెన్ కూటమితో జీకే వాసన్ చేతులు కలిపారు. ఆయన సారథ్యంలోని తమిళ్ మానిల కాంగ్రెస్ (టీఎంసీ)కు 26 నియోజకవర్గాలను కేటాయించారు. వాసన్ కోసం విజయకాంత్ ఏకంగా 20 నియోజకవర్గాలను త్యాగం చేశారు. కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా తమ వంతుగా సీట్లను తగ్గించుకుని.. టీఎంసీకి చెప్పుకోదగిన నియోజకవర్గాలను ఇచ్చాయి.
కాగా, శనివారం సాయంత్రం కూటమి నేతలు వైగో, తిరుమావళవన్, రామకృష్ణన్, ముత్తరసన్లు జీకే వాసన్ను ఆయన కార్యాలయంలో కలసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. నియోజకవర్గాల పంపకాలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. అనంతరం జీకే వాసన్ సహా కోయంబేడులోని విజయకాంత్ కార్యాలయానికి వచ్చారు.
కూటమిలో వాసన్ చేరే విషయం ఖరారయ్యాక మీడియా సమావేశంలో విజయకాంత్, వైగో, జీకే వాసన్, తిరుమావళవన్, ముత్తరసన్, రామకృష్ణన్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేశారు.
డీఎండీకేకు 104, ఎండీఎంకే 29, టీఎంసీ 26, వామపక్షాలు తలా 25, వీసీకే 25 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏయే స్థానాల్లో పోటీ చేస్తారనే విషయం ఇంకా ఖరారు చేయలేదు.
సమావేశంలో భాగంగా జీకే వాసన్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. దాదాపు 50 ఏళ్ల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ప్రస్తుత కూటమి ఏర్పడిందని చెప్పారు. తమ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం వైగో ప్రసంగిస్తూ.. కూటమి కల ప్రస్తుతం నెరవేరిందని, సాధించాల్సిన లక్ష్యాన్ని కూడా చేరుకుంటామని పేర్కొన్నారు. జీకే వాసన్ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మూస ధోరణికి భిన్నంగా తమ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా విజయకాంత్ బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. విజయకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో మంచి నేతలందరూ ఒక్కటయ్యామని, తమ విజయం ఖాయమని పేర్కొన్నారు.
కాగా, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కెప్టెన్ విజయ్కాంత్కు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేయనున్నారంటూ అందరూ అనుకున్న తరుణంలో విజయకాంత్ అనూహ్యంగా ప్రజా సంక్షేమ కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా డీఎండీకే 124; ప్రజా సంక్షేమ కూటమి 110 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కూటమిలోని ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలు ఈ స్థానాలను పంచుకున్నాయి.
తాజాగా, జీకే వాసన్ నేతృత్వంలోని టీఎంసీని తమ కూటమిలోకి కొన్ని రోజుల క్రితం సమన్వయకర్త వైగో ఆహ్వానించారు. అన్నాడీఎంకేతో వాసన్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఓ దశలో వీరి పొత్తు కూడా ఖరారైందని, అయితే సీట్ల పంపకాల విషయంలోనే జాప్యం జరుగుతోందని ప్రచారం జరిగింది.
మరోవైపు టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కూడా జీకే వాసన్కు ఆహ్వానం పలికారు. మళ్లీ కాంగ్రెస్లో చేరి డీఎంకే కూటమి విజయానికి సహకరించాలని కూడా శుక్రవారం కోరారు. ఈ పరిస్థితుల నడుమ జీకే వాసన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.