పాకిస్థానీలకు భారత ఆధార్, ప్యాన్ కార్డు!
న్యూఢిల్లీ: మన దేశంలో నివసిస్తున్న పాకిస్థాన్కు చెందిన మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవనుంది. ఈ మేరకు హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 'వీటికి ఆమోదం లభిస్తే పాకిస్థానీ హిందువులు ఆస్తుల కొనవచ్చు. బ్యాంకు ఖాతాలు తెరవవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్కార్డువంటివీ పొందొచ్చు' అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
దేశపౌరులుగా రిజిస్ట్రే కోసం వారు రూ.15వేలు చెల్లించాల్సి ఉండగా దాన్ని రూ.100కు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. తాము అధికారంలోకి వస్తే దేశంలో నివసించే పాకిస్థానీ హిం దువులు, సిక్కులు తదితర మైనారిటీల కష్టాలు తీరుస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది.
కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ బాధ్యతలు చేపట్టాక పాకిస్థానీ మైనారిటీల కష్టాలు తీర్చేందుకు లాంగ్ టర్మ్ వీసా(ఎల్టీవీ) జారీసహా పలు చర్యలు చేపట్టింది. 2015 సెప్టెంబరులో పాక్, బంగ్లాదేశ్ శరణార్థుల వీసా కాలపరిమితి ముగిశాక కూడా దేశంలో ఉండే వెసులుబాటు కల్పించింది.
దేశవ్యాప్తంగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ దేశాలకు చెందిన మైనారీటీలు సుమారు 2 లక్షల మంది నివాసం ఉంటున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా జోధ్పూర్, జైసల్మేర్, జైపూర్, రాయ్పూర్, అహ్మదాబాద్, రాజ్కోట్ తదితర ప్రాంతాల్లో సుమారు 400 పాకిస్థానీ శరణార్థుల శిబిరాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విదేశీయులు భారత పౌరులుగా ప్రమాణం చేయాలంటే... కలెక్టరు/డిప్యూటీ కమిషనర్/జిల్లా మెజిస్ట్రేటు వంటి ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలన్న నిబంధన విషయంలోనూ పాక్ మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం కొంత సడలింపునివ్వనుంది.
అంతర్ రాష్ట్ర ప్రయాణాల్లో వారికి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. విదేశీ శరణార్థులు మనదేశంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి... ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దృష్టిసారిస్తోంది.