జయకు ఏమైంది: స్వామి ట్వీట్,వేడెక్కిన తమిళనాడు
చెన్నై: అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. తమిళనాడులో ఎవరిద్దరు కలుసుకున్నా దీనిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే వార్తలు వస్తున్నాయి.
వీడియో కాన్ఫరెన్సులకు కూడా ఆమె హాజరు కాకపోవడం వదంతులకు ఊతమిస్తోంది. డిఎంకే అదినేత కరుణానిధి కూడా కొద్ది రోజుల క్రితం జయలలిత ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. అలాగే ఇలంగోవన్, తిరుమావళన్ తదితర నేతలు కూడా ఇదే అంశంపై వ్యాఖ్యానించారు.
తమిళనాడులో ప్రభుత్వం ఉందా అని స్టాలిన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని వ్యాఖ్యానించారు. బిజెపి మాత్రం ఆవిషయాలపై డిమాండ్ సరికాదని పేర్కొంది.
జయలలిత ఆరోగ్యంపై కొన్ని రోజులుగా రాష్ట్రంలోనూ, రాజకీయ నేతల్లోనూ, పరిశీలకుల్లోనూ రకరకాల వదంతులు షికారు చేస్తున్నాయి. కొంతకాలంగా ఆమె సచివాలయానికి రావడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా పోయెస్ గార్డెన్కే పరిమితమవుతున్నారు.
అందువల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందనే ప్రచారం జరుగుతోంది. మధుమేహంతో బాధపడుతున్నారని, చక్కెర శాతం ప్రమాదకరస్థాయిని దాటిందని, రక్తపోటూ ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి సోమవారం రాత్రి తన ట్విటర్ ఖాతాలో జయ ఆనారోగ్యంపై చేసిన ట్వీట్ రాజకీయ అలజడి సృష్టిస్తోంది.
'జయలలిత ఏ క్షణమైనా అమెరికాలోని బాల్టిమోర్కు వెళ్తారు. అక్కడ ఆమె జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు. అక్కడే ఆమెకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేస్తారు' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ నెల రెండోతేదీ డీఎంకే నేత కరుణానిధి జయ ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదని, అందుకే సరిగ్గా విధులు నిర్వర్తించలేకున్నారని, ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలంటూ ఘాటుగా విమర్శించారు. దానికి ప్రతిగా అన్నాడీఎంకే తన అధికార పత్రిక నమదు ఎంజీఆర్లో ఘాటైన వ్యాసం రాసింది.
ఎవరు విశ్రాంతి తీసుకోవాలో 2016 ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారంటూ కరుణానిధిపై విరుచుకుపడింది. ఇలా ఉండగా సోమవారం కాంగ్రెస్ పార్టీ కూడా జయ ఆరోగ్యంపై వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ డీఎంకేతో గళం కలిపింది. జయ ఆరోగ్యంపై వాస్తవాలు వెల్లడించాలని పేర్కొన్నారు.
ఉప ఎన్నికల్లో చెన్నైలోని ఆర్కే నగర్ నుంచి శాసనసభ్యురాలిగా నెగ్గిన జయలలిత ఈ నెల 4న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సచివాలయానికి రాలేదు. మొత్తానికి జయలలిత ఆరోగ్యంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.