ఫలించిన భారత్ వ్యూహం: ఐసీజేకు మళ్లీ భండారీ ఎన్నిక.. భారత్కు తెచ్చిన కీర్తి
హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ తిరిగి ఎన్నిక కావడంతో భారత్ మరోసారి అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్ఠలు సాధించింది.
ఐక్యరాజ్యసమితి: అది ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశం. ఒకనాడు రవి అస్తమించని సామ్రజ్యానికి అధినేత బ్రిటన్. అంతర్జాతీయ వ్యవహారాల్లో 'భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ దేశాల'దే కీలక బాధ్యత.. కీలకం కూడా.. కానీ ఐరాస సాధారణ అసెంబ్లీలో.. భద్రతామండలిలో సాధారణ సభ్య దేశం.. 70 ఏళ్ల క్రితం అదే 'రవి అస్తమించని సామ్రాజ్యం' కింద బానిస సంకెళ్లలో మగ్గిన దేశం భారత్.. ప్రజాస్వామ్య పిపాసకు మారుపేరుగా.. స్వేచ్ఛగా విస్త్రుత ప్రాతిపదికన ప్రపంచ దేశాల్లో ప్రత్యేకించి త్రుతీయ ప్రపంచ దేశాలకు ఆశాకిరణం అంతర్జాతీయంగా వివిధ దేశాల మద్దతు కూడగట్టగలిగింది.
మరీ ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్లో సొంత ప్రయోజనాల పరిరక్షణ ప్లస్ ఇండో - పసిఫిక్, ఆసియా - పసిఫిక్ రీజియన్లలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారతదేశంతో స్నేహం అమెరికాకు అవసరం కావాల్సి వచ్చింది. దీంతో విస్త్రుతస్థాయిలో వివిధ దేశాల మద్దతు కూడగట్టిన భారతదేశానికి మద్దతు ప్రకటించడంతో బ్రిటన్ ఆత్మరక్షణలో పడింది.
అంతర్జాతీయంగా పలుకబడి చాటుకున్న భారత్
అందుకే హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో న్యాయమూర్తి ఎన్నికల్లో బ్రిటన్ తన అభ్యర్థి క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ అభ్యర్థిత్వాన్ని చివరి క్షణాల్లో ఉపసంహరించుకోవడంతో భారత్ ప్రతినిధి దల్వీర్ భండారీ విజయం సాధించారు. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జీగా దల్వీర్ భండారీ గెలుపుతో ప్రపంచదేశాల్లో తన పలుకుబడిని భారత్ మరోసారి చాటుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ సంబంధాల్లో మరింత కీలక పాత్రను పోషించే దిశగా భారత్ సిద్ధమవుతోంది. దల్వీర్ గెలుపునకు మద్దతు కూడగట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఉన్నతాధికారుల బృందం, యూఎన్లోని దౌత్యాధికారుల లాబీయింగ్ మంచి ఫలితాన్నిచ్చింది.
గత జూలైలోనే లాబీయింగ్ ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత్కు చెందిన కుల్భూషణ్ జాదవ్కు పాకిస్థాన్ విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆ బెంచ్లో భారత జడ్జి ఉండడం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్లే దల్వీర్ అభ్యర్థిత్వాన్ని మళ్లీ నామినేట్ చేసినప్పటి నుంచి గెలుపుకోసం ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. గత జూలైలో జీ - 20 సమావేశంలో లాబీయింగ్ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశం, మయన్మార్ తదితర దేశాల్లో ద్వైపాక్షిక పర్యటనల్లోనూ భండారీ విజయానికి మోదీ మంత్రాంగం నడిపారు.
100 దేశాల ప్రతినిధులతో సుష్మ ఇలా సంప్రదింపులు
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అధికారుల బృందం ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు చెందిన 100 దేశాల ప్రతినిధుల్ని సంప్రదించినట్లు సమాచారం. ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాయబారం కొనసాగిస్తూ వచ్చారు. దౌత్యపరమైన సమావేశాల్లో భండారీ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావించడంతో పాటు అవసరమైన మద్దతు సాధించడంపై మంత్రి సుష్మ, విదేశాంగ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. భండారీ మద్దతు కోసం మోదీ స్వయంగా పలువురు ప్రధానులకు లేఖలు రాశారని సమాచారం. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు పలు దేశాల సందర్శన సమయంలో కసరత్తు చేశారు.
ఐసీజేలో ప్రాతినిధ్యానికి దూరమైన బ్రిటన్
అంతర్జాతీయ న్యాయస్థానం చరిత్రలో తొలిసారి బ్రిటన్కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1945లో ఐరాస అంతర్జాతీయ కోర్టు సంస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడంతో పాటు దేశీయంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నది. మరోవైపు దౌత్యపరంగా అంతర్జాతీయ ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో తాజా పరిణామాన్ని అవమానకర ఓటమిగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఐసీజే పదవి కోసం బ్రిటన్ చివరివరకూ అన్నిరకాల ఎత్తుగడలు, వ్యూహాలు అనుసరించినా ఫలితం దక్కలేదు.
తాత తండ్రీ బాటలోనే జస్టిస్ దల్వీర్ భండారీ
తాత, తండ్రి బాటలోనే దల్వీర్ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. 1947 అక్టోబర్ ఒకటో తేదీన జైన్ కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్థాన్లోని జోధ్పూర్లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ షికాగో వర్క్షాప్లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందింది.
అంతర్జాతీయ చట్టాల అమలుపై ఇలా విస్తృత అనుభవం
జస్టిస్ దల్వీర్ భండారీ అంతర్జాతీయ స్కాలర్షిప్ కూడా అందుకున్నారు. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్వెస్టర్న్ యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ లా' చదివేందుకు మరో స్కాలర్షిప్ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం' అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు.
2014లో పద్మభూషణ్ పురస్కారంతో ప్రదానం
1977లో జైపూర్ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో 13 ఏళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది.
రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు యధాతథం అన్న భారత్ హైకమిషనర్
ఐసీజే ఎన్నికల్లో బ్రిటన్ ఓటమి పాలవ్వడం అవమానకరమని గ్రేట్ బ్రిటన్లోని మీడియా వ్యాఖ్యానించింది. భండారీ ఎన్నికతో 15 మంది సభ్యులతో కూడిన ఐసీజేలో తమ దేశం నుంచి బ్రిటన్కు ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. దీంతో బ్రిటన్ మీడియా పలు వార్తా కథనాలు రాసింది. భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశంగా బ్రిటన్.. సాధారణ సభ్యదేశం భారతదేశం చేతిలో ఓడిపోవడంతో అంతర్జాతీయంగా దౌత్యపరంగా బ్రిటన్ సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. బ్రిటన్కు అవమానకరం అని వ్యాఖ్యానించింది. భారత్, బ్రిటన్ రెండూ ఒకే రకమైన న్యాయ వ్యవస్థలు గల దేశాలు. ఐసీజే ఎన్నికలపై ఇరు దేశాలు పరస్పరం చర్చించుకున్నాయని బ్రిటన్ విదేశాంగశాఖ పేర్కొన్నది. ఐసీజేలో ఫలితం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. బ్రిటన్లో భారత్ తాత్కాలిక హై కమిషనర్ దినేష్ పట్నాయక్ మాట్లాడుతూ ఐసీజే ఎన్నికలతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని పునరుద్ఘాటించారు.