శశికళకు వారి మద్దతు వెనుక..!: ఆ ఒక్క తప్పటడుగు వేశారా?
జయలలిత మృతి తర్వాత పార్టీలో శశికళ చక్రం తిప్పుతున్నారు. ఆమె ప్రస్తుతానికి అనధికారికంగానే చక్రం తిప్పుతున్నారు. పార్టీ అధినేత్రి కావడానికి ఆమె ఉవ్వీళ్లూరుతున్నారు.
చెన్నై: జయలలిత మృతి తర్వాత పార్టీలో శశికళ చక్రం తిప్పుతున్నారు. ఆమె ప్రస్తుతానికి అనధికారికంగానే చక్రం తిప్పుతున్నారు. పార్టీ అధినేత్రి కావడానికి ఆమె ఉవ్వీళ్లూరుతున్నారు. అక్రమాస్తుల కేసు సుప్రీం కోర్టులో లేకుంటే ఇప్పటికే ఆమె పార్టీ పగ్గాలను అధికారికంగా చేపట్టేవారని అంటున్నారు.
జయలలిత ఆస్తుల కేసు తేలేది ఎప్పుడు: శశికళ నాలుగేళ్లు వెయిట్ చేయాలా?
తొలుత పార్టీ పగ్గాలు, ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు శశికళ పావులు కదుపుతున్నట్లుగా జయలలిత మృతి తర్వాత నుంచి వరుసగా కథనాలు వస్తున్నాయి. జయలలిత మృతి నేపథ్యంలో పార్టీని అనధికారికంగా నడుపుతున్న శశికళను పార్టీ శ్రేణులు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.
కొందరు ప్రశ్నించినా..
శశికళ పుష్ప వంటి ఒకరిద్దరు ప్రశ్నించినా.. ఎక్కువ మంది శశికళకు మద్దతు ఇస్తుండటంతో ఆ ప్రభావం కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీ, ప్రభుత్వ పగ్గాలు ఎవరికో అందరికి తెలిసిపోయింది. ఆ దిశగా శశికళ పావులు కదుపుతున్నట్లుగా ఎప్పటికి అప్పుడు ప్రచారం సాగుతోంది.
శశికళకు మద్దతు వెనుక..
శశికళకు ఎక్కువ మంది మద్దతిస్తున్నారు. కానీ పార్టీలో అందరూ మద్దతివ్వడం లేదు. చాలామంది మంత్రులు, శాసన సభ్యులకు ప్రస్తుతం తమ పదవులు కోల్పోవడం ఇష్టం లేదు. అందుకే శశికళకు మద్దతివ్వడం లేదని అంటున్నారు. అందుకు ఓ కారణం ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడెనిమిది నెలలే కావొస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో సంక్షోభం వచ్చి, మళ్లీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికలకు మరో నాలుగేళ్లకు పైగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
సీనియర్లు
పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారిని కాదని శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం కష్టం. ఒకవేళ పార్టీ పగ్గాలు చేపట్టినా వారిని అదుపు చేయడం అంత తేలికైన పని కాదని అంటున్నారు. శశికళకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.
శశికళ తప్పటడుగు వేశారా?
శశికళ... జయలలిత అంతిమయాత్ర సందర్భంగా తప్పటడుగు వేశారా అనే చర్చ సాగుతోంది. జయ అంత్యక్రియల్లో, అంతిమయాత్రలో శశికళ హవా కనిపించింది. సుమారు ఇరవై మంది శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు కనిపించారు. ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదు. ఇది శశికళ చేసిన పొరపాటు అని, ఇది పలువురు నేతల్లో ఆగ్రహం కలిగించి ఉండవచ్చునని, కానీ బయటపడలేకపోతున్నారని అంటున్నారు.