రసవత్తరంగా తమిళ రాజకీయం: ట్విస్ట్ ఇక్కడే...
‘అమ్మ’ వీర విధేయుడి సింహగర్జన.. పురుచ్ఛితలైవి నెచ్చెలి మౌన వ్యూహం మధ్య తమిళనాట అధికారం కోసం ఆరాటం.. ఆధిపత్య పోరు వెరసి రసవత్తర రాజకీయం సాగుతున్నది.
చెన్నై: 'అమ్మ' వీర విధేయుడి సింహగర్జన.. పురుచ్ఛితలైవి నెచ్చెలి మౌన వ్యూహం మధ్య తమిళనాట అధికారం కోసం ఆరాటం.. ఆధిపత్య పోరు వెరసి రసవత్తర రాజకీయం సాగుతున్నది. మంగళవారం రాత్రి జయ సమాధి వద్ద పన్నీర్ సెల్వం దీక్షతో మొదలైన ఉత్కంఠ బుధవారం పలు మలుపులు తిరిగింది. రోజంతా ఇరు పక్షాలు ఎత్తుకు పైఎత్తుతో వ్యూహ రచనతో ముందుకు సాగాయి.మ్రుదు స్వభావిగా కనిపించే పన్నీర్ సెల్వం మీడియా సమావేశం సింహ గర్జన చేశారు.
తానే సీఎంనని, అమ్మకు అనుంగు శిష్యుడినైనందున తనకే అన్ని అర్హతలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు అసలు అమ్మ మరణం మిస్టరీపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసి శశికళ గ్రూప్కు సవాల్ విసిరారు. మరోవైపు జయ నివాసం 'పొయెస్ గార్డెన్స్' ప్లస్ అన్నాడీఎంకే కార్యాలయం వేదికగా శశికళ, ఆమె గ్రూప్ నేతలు చెలరేగిపోయారు.
తమకే 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ప్రకటించారు. పార్టీలో చీలికకు పన్నీర్ కుట్ర పన్నుతున్నా డని, ద్రోహులను క్షమించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తమ గ్రూప్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని తమిళనాడుతోపాటు యావత్ దేశం ఆసక్తితో ఎదురుచూస్తోంది.
వేగంగా డీఎంకే స్పందన
అన్నా డీఎంకేలో సంక్షోభం అనివార్యమని ఊహించిన ప్రధాన ప్రతిపక్షం డీఎంకే వేగంగా స్పందించింది. సీఎంను బెదిరించి రాజీనామా చేయించి, రాజ్యాంగ విరుద్ధంగా శశికళ సీఎం కావడాన్ని తాము అంగీకరించబోమన్న ప్రకటనతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్.. తమ మద్దతు పన్నీర్ సెల్వంకు ఉంటుందని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
శశికళ సీఎం కావడం ప్రధాని నరేంద్ర మోడీకి ఏ మాత్రం ఇష్టంలేదన్న సంగతిని గుర్తించిన స్టాలిన్ తన ప్రకటన ద్వారా కేంద్రానికీ మద్దతునిచ్చినట్లయింది. శశికళను ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత రెండు రోజులకు ప్రధాని మోడీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ మద్దతు కూడగట్టిన తర్వాతే పన్నీర్ సెల్వం తిరుగుబావుటా ఎగురవేశారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వెంట ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెళతారనే విషయం తెలిసే.. ప్రధాని మోడీ, స్టాలిన్ మద్దతుపై ధీమాతోనే ఆయన అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు సిద్ధమని సవాల్ విసిరి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎమ్మెల్యేల 'ఆత్మసాక్షి' ప్రబోధంపై పన్నీర్ ధీమా
ఎమ్మెల్యేలు అమ్మ ఆత్మ సాక్షిగా ఓటేస్తారని పన్నీర్ మరోసారి ధీమాగా చెప్పారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు వారం లోగా తీర్పు చెప్తామని ప్రకటించడం, శశికళ తాత్కాలిక ప్రధాన క్యార్యదర్శి ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం నిర్ణయానికి రావడం, జయ కుటుంబసభ్యుల నుంచి తగినంత మద్దతు లభించడం, ప్రధాన ప్రతిపక్షం సైతం అండగా నిలవడం పన్నీర్కు కొండంత ధైర్యం ఇచ్చినట్లు కనిపించింది.
కానీ వాస్తవంగా శశికళ నిర్వహించిన సమావేశానికి వంద మంది లోపు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని సమాచారం. దీంతో వీరిని బయటకు వదిలితే పన్నీర్ పక్షాన చేరిపోతారన్న భయంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో నగరంలోని రెండు స్టార్ హోటళ్లకు తరలించారు. తాము ఎక్కడికీ వెళ్లబోమని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినా బలవంతంగా హాటల్కు తీసుకువెళ్లి తమ మద్దతుదారులను కాపలాగా ఉంచారు. ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి స్పందిస్తూ ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని చర్యలు తీసుకోక తప్పదనడం గమనార్హం.
సీఎం పీఠంపై ఇరువురి ధీమా
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పన్నీర్ సెల్వం, శశికళలకు ఎంత మంది మద్దతునిస్తున్నారన్న విషయం ఇతమిద్దంగా తెలియకున్నా వారిద్దరూ తామే సీఎం కాబోతున్నామని ధీమాగా చెబుతున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ తనకు అవకాశం ఇస్తారని పన్నీర్ చెబుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్రావు ఇద్దరికీ సమయం కేటాయించకుండా గురువారం సాయంత్రం ఆయనే చెన్నై వస్తున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... అది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని తమిళనాడుతో పాటు యావత్ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.