మెట్రోనా.. మజాకా.. వారాంతంలో ఫుల్ జోష్: 2.10 లక్షలు దాటిన ఫుట్ పాల్
హైదరాబాద్: భాగ్య నగర వాసులకు ఇది సరికొత్త అనుభూతి. నిలువెత్తు నింగి నుంచి ప్రయాణం. రహదారులపై వాహనాల రొదకు దూరంగా.. కుదుపులకు తావు లేకుండా.. ఆకాశంలో జాలీజాలీగా మెట్రో రైలు ప్రయాణం ఎంతో సరదా తెచ్చింది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తొలి వారాంతం కావడంతో హైదరాబాద్ నగర వాసులు శనివారం విపరీతంగా వచ్చారు. నాగోల్ - మియాపూర్ మార్గం పర్యాటక ప్రాంతాన్ని తలపించింది. మెట్రో స్టేషన్లు, రైళ్లు ప్రయాణికుల రద్దీతో పోటెత్తింది.ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులతో పరుగులు పెట్టే ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం వీకెండ్ హాల్ట్తో ఊపిరి పీల్చుకున్నాయి.
శనివారం సెలవు దినం కావడంతో ఎంఎంటీఎస్ స్టేషన్లలో, రైళ్లలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.. మెట్రోలో కనిపించింది. మెట్రో రైలులో శనివారం 2.10 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్ఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టేషన్ల వద్ద గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.
సందర్శక ప్రయాణికుల సంఖ్యే ఎక్కువ
వారాంతపు ప్రయాణం కోసం పిల్లలు, పెద్దలు అంతా కుటుంబాలతో సహా మెట్రో స్టేషన్లకు తరలివచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైల్లో పయనించి తీరాలనే భాగ్య నగర వాసుల కోరిక, పట్టుదలతో రైళ్లు కిక్కిరిసాయి. టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్ల వద్ద జనం బారులు తీరారు. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, తదితర స్టేషన్లలో రద్దీ బాగా కనిపించింది. సాధారణ ప్రయాణికుల కంటే సందర్శన కోసం వచ్చిన ప్రయాణికుల రద్దీయే ఎక్కువగా ఉంది. నవంబర్ 29 నుంచి మెట్రో నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ నుంచి 1వ తేదీ వరకు పనిదినాలు అయినప్పటికీ రోజుకు 2 లక్షల మందికి పైగా పయనించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, తదితర విద్యా సంస్థలకు సెలవు కావడంతో అంతా పోలోమంటూ మెట్రోకు ఉరకలు వేయడంతో రద్దీ పెరిగింది. నాగోల్ నుంచి మియాపూర్ నుంచి వచ్చే రైళ్లకు కేంద్రమైన అమీర్పేట్ ప్రయాణికులతో సందడి సందడిగా కనిపించింది. కుటుంబాలతో కలసి మెట్రోకు వచ్చిన చాలామంది సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు.
ఎంఎంటీఎస్ రైళ్లలో ఐటీ ఉద్యోగులే ఎక్కువ
హైదరాబాద్ నగరంలో శనివారం ఒకవైపు మెట్రోరైలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడగా ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం బోసిపోయాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే చాలా మంది ఉద్యోగులు ఎంఎంటీఎస్పైనే ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే వారే మెజారిటీ ఉంటారు. ఐటీ సంస్థల్లో పని చేసేవారు ఎంఎంటీఎస్లో పాస్లు తీసుకొని రెగ్యులర్గా పయనిస్తున్నారు. రోజుకు సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులతో 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. శనివారం సెలవు దినం కావడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఈ రైళ్లు సాధారణ రద్దీతోనే కనిపించాయి.
సగానికి పడిన ఆదాయంతో ఆందోళన
మెట్రో రైలు రాక ఆటోలు, క్యాబ్ల గిరాకీపైనా ప్రభావం చూపిస్తోంది. రెండు రోజులుగా వీరు ప్రయాణికులు తగ్గి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజూ వచ్చే ఆదాయం ఇప్పుడు సగానికి పడిపోయింది. మరోవైపు మీటర్లు వేయకుండా నిలువు దోపిడీకి పాల్పడే ఆటో రిక్షాల నుంచి కొంత మేరకు ఊరట లభించిందని ప్రయాణికులు భావిస్తున్నారు. సిటీలో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉండగా, ప్రతి రోజు సుమారు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి మార్గాల్లో ఆటో ప్రయాణాలపైన మెట్రో ప్రభావం పడింది. నిబంధనల మేరకు మీటర్ రీడింగ్ ప్రకారం చార్జీలు వసూలు చేసే ఆటోడ్రైవర్లు మాత్రం మెట్రో రాక నష్టంగానే భావిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే నాగోల్ - మియాపూర్ మార్గంలోనే మెట్రో అందుబాటులోకి రావడంతో క్యాబ్లపైన ప్రభావం స్పష్టంగానే ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలకు అనుసంధానం చేసి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్లు, యజమానులకు మెట్రో ఎఫెక్ట్ ఆశానిపాతమే. మియాపూర్ - అమీర్పేట్ రూట్లో, తార్నాక, సికింద్రాబాద్, అమీర్పేట్, మియాపూర్ మార్గంలో మెట్రో ప్రభావం వల్ల ట్రిప్పులు తగ్గుముఖం పట్టిందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు.
25 వేల స్మార్టు కార్డులు విక్రయించామన్న మెట్రో రైలు
మెట్రో జోష్ జర్నీ మూడోరోజూ అదే స్థాయిలో కొనసాగింది. శుక్రవారం కూడా మెట్రో రైళ్లలో సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో రైళ్లలో రెండు లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. కాగా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ లేమి, స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆర్టీసీ ఫీడర్ బస్సులు లేక ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయాలు ఊపందుకున్నాయి. నాలుగు రోజులుగా సుమారు 25 వేల స్మార్ట్కార్డులను విక్రయించామని ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్ కార్డులతో సాఫీగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నది. కాగా స్టేషన్లలో స్మార్ట్కార్డుల రీచార్జీకి అవసరమైన సాఫ్ట్వేర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని.. అప్పటివరకు పేటీఎం ద్వారా రీచార్జీ చేసుకోవాలని సూచించాయి.
ఫైనాన్సర్ల వేధింపులతో క్యాబ్ డైవర్ల ఆవేదన ఇలా
మెట్రో రైలు రాకతో గిరాకీలు తగ్గాయని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. గతంలో రోజుకు ఆదాయం రూ.1200-1500 వరకు వచ్చేదని, మెట్రోతో దూర ప్రయాణం చేసేవారు ఆటోల వైపు చూడడం తగ్గిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. దీంతో ఆదాయం రూ. 600 - 800లకు పడిపోయిందని, అసలే కిరాయి ఆటో, రోజుకు రూ.300 చెల్లించాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైనాన్సర్ల వేధింపులు, అప్పుల బాధలతో రోడ్డున పడ్డ తమకు మెట్రో రాకతో మరిన్ని కష్టాలు వచ్చాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు యజమానుల సంఘం అధ్యక్షుడు శివ ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లేవాళ్లు తప్ప సిటీలో తిరిగే వాళ్లు తగ్గిపోయారన్నారు. ఒక్క ఎయిర్పోర్టు మార్గంలోనే లక్షల వాహనాలు తిరగలేవు కదా. ట్రిప్పులు గణనీయంగా తగ్గాయని, తమ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండులా ఉన్నదని తెలిపారు.