3లక్షల కి.మీ: ప్రారంభానికి ముందే!, హైదరాబాద్ మెట్రో.. కొత్త విషయం వెలుగులోకి..
తొలుత నాగోల్-ఎన్జీఆర్ఐ మార్గంలో 3కి.మీ మేర మెట్రో ట్రయల్ రన్ ప్రారంభమైంది.
Recommended Video
హైదరాబాద్: 2007లో మెట్రో పనులు మొదలైన నాటి నుంచి హైదరాబాద్ ప్రజలంతా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత ఇప్పుడా కల సాకారం కాబోతోంది.
ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నాం 2.15గం.కు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రోకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
ఇదో రికార్డు:
దేశంలో 30 కి.మీల మేర మెట్రో రైలు సేవలను ఒకేసారి ప్రారంభోత్సవం చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. దీంతో హైదరాబాద్ మెట్రో ప్రారంభంలోనే రికార్డును సొంతం చేసుకుంది. శనివారం నాడు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి మెట్రోలో ప్రయాణించిన తర్వాత మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ట్రయల్ రన్ 3లక్షల కి.మీ:
ఆగస్టు 7, 2014న అధికారులు తొలిసారి మెట్రో ట్రయల్ రన్ నిర్వహించారు. అప్పటినుంచి ఇప్పటివరకు మెట్రో రైలు ఏకంగా 3లక్షల కి.మీ ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెట్రోలో ఏవిధమైన లోపాలు లేకుండా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు.
18రైళ్లు, 30కి.మీ:
నేడు మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా.. మొత్తం 18రైళ్లు, 30కి.మీ మార్గంలో సేవలందించడానికి సిద్దమయ్యాయి.
కాగా, హైదరాబాద్ లోని మూడు కారిడార్లలోని 72 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లను నడిపేందుకు రెండేళ్ల క్రితమే 57 రైళ్లను కొరియా నుంచి అధికారులు దిగుమతి చేసుకున్నారు. అందులో రెండింటిని నాగ్పూర్ మెట్రోకు అద్దెకు ఇవ్వగా ప్రస్తుతం 55 ఉన్నాయి.
నాగోల్-ఎన్జీఆర్ఐ:
తొలుత నాగోల్-ఎన్జీఆర్ఐ మార్గంలో 3కి.మీ మేర మెట్రో ట్రయల్ రన్ ప్రారంభమైంది. అక్టోబరు 24, 2015లో మియాపూర్-ఎస్ఆర్ నగర్ మధ్య ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆ తర్వాత మెట్టుగూడ-ఎస్ఆర్నగర్ వరకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ 30 కిలోమీటర్ల పరిధిలో గత వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
టైమ్ లేదు, ఆరోజు ఇద్దరూ మాట్లాడరు: ఇవీ టైమింగ్స్, 'మెట్రో'పై కేటీఆర్..
39నెలలుగా:
గత 39 నెలలుగా నిర్వహిస్తూ వస్తున్న మెట్రో ట్రయల్ రన్స్ లో ఎక్కడా.. ఎటువంటి లోపం తలెత్తలేదు. మొత్తం మీద అధికారికంగా ప్రారంభం కాకుండానే మెట్రో రైళ్లు ఇప్పటి వరకు ఏకంగా 3 లక్షల కిలోమీటర్లు పరుగులు పెట్టినట్టు మెట్రో అధికారులు స్పష్టం చేశారు.