శోభన్ బాబు-జయలలితల ప్రేమకు ప్రతిరూపాన్ని, నేనే వారసురాలిని: అమృత సంచలన లేఖ
నటుడు శోభన్బాబు, జయలలితల ప్రేమకు ప్రతీరూపం తానని అన్నారు.
చెన్నై: బ్రతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా తమిళ రాజకీయాలన్ని జయలలిత చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయంగాను-రక్త సంబంధం పరంగాను వారసుల పంచాయితీ కూడా కొనసాగుతూనే ఉంది. ఆమె ఆస్తులకు అసలైన వారసులం తామేనంటూ కొత్త పేర్లు తెర పైకి వస్తూనే ఉన్నాయి.
నేనే అసలైన వారసున్ని: తెర పైకి జయలలిత కొడుకు!, 'అది నచ్చకే చంపేశారు'
తాజాగా అమృత అనే ఓ మహిళ.. తానే జయలలిత కన్నబిడ్డను అని సంచలన ప్రకటన చేశారు. 'నటుడు శోభన్బాబు, జయలలిత ప్రేమకు ప్రతీరూపం తానని, కావాలంటే డీఎఏ టెస్టుకైనా సిద్దమే' అంటూ ప్రకటించారు. జయలలిత మరణంపై సీబీఐతో విచారణ జరిపించి, నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ లకు ఆమె రాసిన లేఖల్లో ఈ నిజాలు వెలుగుచూసినట్లుగా తెలుస్తోంది.
శోభన్-జయలలితల ప్రేమకు ప్రతీరూపం:
'మాజీ ముఖ్యమంత్రి జయలలిత నా కన్నతల్లి. తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో శోభన్బాబు ఆమెకు అండగా నిలిచారు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమ ఆప్యాయలతకు గుర్తుగా నేను పుట్టాను. అయితే కారణాలేమైనా వారిద్దరు వివాహం చేసుకోలేదు'. అని చెప్పుకొచ్చారు.
ఒట్టేయించుకున్నారు:
' నన్ను జయ సోదరి శైలజ, భర్త సారథిలకు అప్పగించారు. నేను ఎవరి బిడ్డను అన్న విషయం ఎప్పటికీ ఎవరికీ చెప్పొద్దని ఆ సమయంలో వారితో ఒట్టు వేయించుకున్నారు. 1996లో శైలజ సూచన మేరకు జయను కలిస్తే వివరాలు తెలుకుని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నారు. అయితే ఆమె నా తల్లి అన్న విషయాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ చెప్పలేదు' అని పేర్కొన్నారు.
ఆ విషయం బాధించింది:
జయ మరణం తర్వాత ఆమె ఆస్తుల కోసం తామే వారసులమంటూ దీప,దీపక్ లు హడావుడి చేయడం తనను బాధించిందన్నారు. తన తల్లి మరణం వెనుక శశికళ, నటరాజన్ ల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిజాలు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అమృత రాసిన లేఖ ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి లేఖ రాశారు? అని చాలామంది ఆరా తీస్తున్నారు.
అప్పట్లో కృష్ణమూర్తి:
జయలలిత మరణించిన కొద్ది నెలల తర్వాత చెన్నైలోని ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి కూడా తానే జయలలిత కన్నబిడ్డను అంటూ అప్పట్లో మీడియా ముందుకు వచ్చాడు. ప్రపంచానికి జయలలిత తనను పరిచయం చేయాలనుకుంటున్న తరుణంలోనే ఆమె మృతి చెందారని, ప్రాణహాని ఉన్నందునే ఇప్పుడు తెర పైకి రావాల్సి వచ్చిందని ఆ సమయంలో చెప్పుకొచ్చాడు.