ఐటీ రీఫండ్ స్కామ్: అంతా టెక్కీలే.. నిగ్గు తేల్చిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్!
దీర్ఘకాలిక అనారోగ్యం, అంగవైకల్యం పేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దాదాపు 200మంది ఇన్కమ్ టాక్స్ పరిధి నుంచి మినహాయింపు పొందినట్లు గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు తప్పుడు ధ్రువ పత్రాలతో ఇన్కమ్ టాక్స్ రీఫండ్ చేయించకున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు నిర్దారించారు. దీనికి సంబంధించిన చార్జ్ షీటు వివరాలు తాజాగా వెలుగుచూశాయి.
ఇందులో పోలారిస్ కంపెనీ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. దీర్ఘకాలిక అనారోగ్యం, అంగవైకల్యం పేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దాదాపు 200మంది ఇన్కమ్ టాక్స్ పరిధి నుంచి మినహాయింపు పొందినట్లు గుర్తించారు.
నిందితులు వీరే:
ఈ అవకతవకల్లో ఇద్దరు ఇన్కమ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, కేసును విచారిస్తున్న ఇన్ కమ్ టాక్స్ డైరెక్టర్ ఎం మోహన్ బాబు తెలిపారు.
ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అవకతవకలపై ఎన్.శ్రీకాంత్ గౌడ్(43), మహమ్మద్ ఖలీల్(34) లపై అభియోగాలు నమోదు చేస్తూ.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు.
టెక్కీలే టార్గెట్:
శ్రీకాంత్, ఖలీల్ ఇద్దరి ఆఫీసులు దిల్సుఖ్నగర్లో ఉన్నట్లు గుర్తించారు. ఇన్కమ్ టాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న తర్వాత.. వాస్తవాలు అంగీకరించిన కొంతమంది ఐటీ ఉద్యోగులను ఇందులో సాక్ష్యులుగా చేర్చారు.
త్వరితగతిన ఐటీ రీఫండ్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతూ శ్రీకాంత్, ఖలీల్ దిల్ సుఖ్ నగర్ లో ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడినుంచే సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన చాలామంది ఐటీ ఉద్యోగులను సంప్రదిస్తూ ఐటీ రీఫండ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సీసీఎస్ అసిస్టెంట్ సీపీ కె.రామ్ కుమార్ తెలిపారు.
10శాతం కమీషన్:
అక్రమంగా నిర్వహిస్తున్న ఈ కార్యకలాపాల విషయంలో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రామ్ కుమార్ తెలిపారు. 'సెక్షన్ 80డీ, 80డీడీ కింద ఆరోగ్య కారణాల రీత్య మాత్రమే ఇన్ కమ్ టాక్స్ రీఫండ్ చేయబడుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు తమ అక్రమాలను కొనసాగించారు.'
' ఐటీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేరిట తప్పుడు మెడికల్ పత్రాలు క్రియేట్ చేసి రూ.50వేలు నుంచి రూ.1లక్ష వరకు రీఫండ్ జరిగేలా చేస్తున్నారు. అందులో 10శాతం కమిషన్ వీరికి ముడుతుంది. వీరిద్దరి వల్ల ఆదాయపన్నుల శాఖకు 1.36కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఇది చాలా చిన్న మొత్తం అని, వీళ్లలాగే చాలామంది ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్లంతా బయటపడితే ఆ నష్టం భారీగా ఉంటుంది.'
ఐదారేళ్లుగా:
నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్ గౌడ్ లా గ్రాడ్యుయేట్ కాగా, మహమ్మద్ ఖలీల్ ను కామర్స్ గ్రాడ్యుయేట్ గా గుర్తించారు. గత ఐదారేళ్లుగా వీరిద్దరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.
'నాలుగు రోజుల క్రితం చార్జీ షీటు దాఖలు చేశాం. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన 200మందిలో 50మంది పోలారిస్ కంపెనీకి చెందినవారే' అని రామ్ కుమార్ తెలిపారు. జులై 9, 2017న దీనిపై కేసు నమోదైంది. ఐపీసీ-420, ఐపీసీ-406కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలారిస్ కంపెనీని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.