పేదరికం ఆసరగా సరోగసీ దందా: గుట్టురట్టు చేసిన హైదరాబాద్ టాస్క్ఫోర్స్
హైదరాబాద్: అద్దె గర్భాలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. విదేశాల్లో లక్షల్లో ఖర్చవుతుండటంతో చాలామంది నగరాన్ని ఆశ్రయిస్తున్నారు. రూ.10 లక్షల్లోపు సరోగసీ ద్వారా పిల్లలను పొందే అవకాశం ఉండటంతో, వివిధదేశాల నుంచి ఆశావహ దంపతులు హైదరాబాద్కు వస్తున్నారు.
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక, చాలా ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పేద ప్రజలకు సరోగసీ దళారులు ఇలాంటి వారికి వల వేస్తున్నారు. రూ.లక్ష, రెండు లక్షలు ఇస్తామని ఆశ చూపి, పిల్లల్ని కనేందుకు ఒప్పిస్తున్నారు. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలామంది మహిళలు ఇందుకు అంగీకరిస్తున్నారు. ప్రసవానంతరం పిల్లల్ని తీసుకుని, గర్భం ఇచ్చిన తల్లుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలించేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో చాలామంది రక్తహీనత తదితర సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారు.
పేదరికం, అసహాయత కారణంగా నిరుపేద మహిళలకు డబ్బు ఎరవేసి.. అనుమతుల్లేకుండా, నిబంధనలను తోసిరాజని హైదరాబాద్లో అక్రమంగా కొనసాగుతున్న అద్దెగర్భాల (సరోగసీ) కేంద్రం గుట్టును వైద్యఆరోగ్యశాఖ, టాస్క్ఫోర్స్ పోలీసు అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో స్థానికులే కాక, దేశ రాజధాని ఢిల్లీ నగరం మొదలు నేపాల్ నుంచి వచ్చినవారూ సేవలు పొందినట్లు సమాచారం.
ఒక్కొక్కరికి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు
సాయి కిరణ్ ఇన్ ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు దళారుల్ని పెట్టుకుని మరీ.. ఈ విధానంలో పిల్లల్ని పుట్టించేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వివిధ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో బంజారాహిల్స్, 14వ రోడ్ నంబర్లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్పై డీఎంహెచ్వో డాక్టర్ కే పద్మజ, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యాన శనివారం రాత్రి దాడులు జరిగాయి. అనుమతుల్లేకుండా రెండు అంతస్తుల్లో ఇన్ ఫర్టిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారనీ, ఒప్పందం కుదుర్చుకున్న మహిళలను గర్భం దాల్చిన దగ్గర్నుంచి, ప్రసవం వరకూ ఇక్కడే నిర్బంధించి ఉంచుతున్నారని తేలిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 50 మంది తల్లులు ఉన్నట్లు తేల్చారు. సంస్థ రికార్డులను స్వాధీనం చేసుకుని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామనీ, కలెక్టర్ ఆదేశాల మేరకు మిగతా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డీఎంహెచ్ వో పద్మజ తెలిపారు.
ఇద్దరు దళారులతో ఇలా...
హైదరాబాద్లోని ఉప్పల్, బాలానగర్ ప్రాంత వాసులు 16మంది, ఢిల్లీ, నేపాల్, నాగాలాండ్, డార్జిలింగ్ తదితర ప్రాంతాలకు చెందినవారు 32మంది మహిళలు సాయికిరణ్ దవాఖానలో అద్దెగర్భం దాల్చినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో రెండు నెలల నుంచి ఎనిమిది నెలలు నిండిన గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు కనుగొన్నారు. ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్లో మరో ఏజెంటు నిరుపేద మహిళలకు డబ్బు ఎరచూపి అద్దె గర్భానికి ప్రోత్సహిస్తున్నట్టు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వైద్యాధికారులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేస్తామని ఆయన తెలిపారు.
వైద్యారోగ్యశాఖ అనుమతి లేకుండానే దందా ఇలా
గర్భం దాల్చే మహిళలకు ప్రాంతలవారీగా అద్దె చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మహిళలకు రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు, ఢిల్లీ, నేపాల్, నాగాలాండ్ వంటి దూర ప్రాంతాల మహిళలకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు దవాఖాన యాజమాన్యం అద్దె చెల్లిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. వైద్యారోగ్యశాఖ నుంచి అనుమతి లేకుండానే ఇప్పటివరకు గర్భంకోసం 500 మంది మహిళలను వినియోగించినట్టు తేలింది. ఆ పిల్లలను విదేశాలకు తరలిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సాయికిరణ్ హాస్పిటల్, ఇన్పెర్టిలిటీ కేంద్రంపై రెండురోజుల కిందట నగర టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
నిర్బంధంలోనే గర్భిణులు
సరోగసీ నిర్వహణకు వైద్యారోగ్య శాఖ నుంచి సాయికిరణ్ ఇన్ ఫర్టిలిటీ సెంటర్కు అనుమతి ఉన్నదా లేదా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టరు పద్మజకు సమాచారం అందించారు. సాయికిరణ్ దవాఖానలోని సరోగసి కేంద్రానికి సంబంధించి జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఎలాంటి రికార్డులు లేవు. కానీ నాలుగైదేళ్లుగా ప్రైవేట్ దవాఖానలో సాగుతున్న ఈ తంతుపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరోగసి నిబంధనల ప్రకారం స్వీయ అంగీకారంతో అద్దెగర్భం దాల్చే మహిళలను నిర్బంధించకూడదు. కాని సాయికిరణ్ దవాఖానలో మాత్రం మహిళలను కన్సీవ్ కాకముందు నుంచి దవాఖాన యాజమాన్యం గర్భం దాల్చి, ప్రసవించేవరకు వారిని దవాఖానలోనే నిర్బంధిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. అద్దెగర్భం ద్వారా జన్మించిన శిశువులను విదేశాలకు తరలించకూడదని డాక్టర్ పద్మజ వివరించారు. సాయికిరణ్ దవాఖానలో సరోగసి ద్వారా జన్మిస్తున్న పిల్లలను విదేశాలకు విక్రయిస్తున్నారా? అనే కోణంలో విచారిస్తున్నట్టు చెప్పారు.
లాభాపేక్షకు దూరంగా ఇలా..
ఒంటరి మహిళ/పురుషుడు, ప్రవాస భారతీయులు, విదేశీయులు, స్వలింగ సంపర్కులు, సహజీవనం చేసేవారు అద్దె గర్భం ద్వారా సంతానం పొందకూడదు. పెళ్లయి ఐదేళ్లయినా పిల్లలు కలగక, తమకిక పిల్లలు పుట్టే అవకాశం లేదని ధ్రువపత్రం సమర్పిస్తే... అద్దెగర్భం ద్వారా సంతానం పొందొచ్చు. అందుకు వారు తమ సమీప బంధువునే ఆశ్రయించాలి. సరోగసీ విధానంలో సంతానం కోరుకునే దంపతుల్లో మహిళ వయసు 23-50, పురుషుని వయసు 26-55 సంవత్సరాల మధ్య ఉండాలి. వారికి సొంత శిశువుగానీ, దత్తత పిల్లలుగానీ ఉండకూడదు. వ్యాపార దృక్పథంతో సరోగసీ కేంద్రాలను నిర్వహించకూడదు. ఒకరు ఒకసారికి మించి గర్భాన్ని దానమివ్వకూడదు. ఇలా కలిగిన పిల్లల్ని వదిలేయడం, లాభాపేక్షతో అద్దె గర్భాన్ని ఎంచుకోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే రూ.10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అద్దెగర్భం ద్వారా పుట్టినవారికీ ఆస్తి హక్కులు వర్తిస్తాయి. సరోగసీ కేంద్రాలు 25 సంవత్సరాల వరకూ అద్దెగర్భం, కాన్పు వివరాలతో రికార్డులను నిర్వహించాలి. బిడ్డలను పొందేవారు గర్భమిచ్చిన మహిళ వైద్య ఖర్చుల్ని మాత్రమే భరించాలి.