కెసిఆర్కు చిక్కులే: వరుస సంఘటనలు, దళితులపైనే...
కరీంనగర్: నేరెళ్ల ఘటనలో దళితులపై పోలీసులు దాడి చేశారనే విమర్శలు వచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. దళితులని ముఖాన రాసి ఉంటుందా అని అడిగారు. కానీ, ఉత్తర తెలంగాణలో దళితులపై జరుగుతున్న సంఘటనలు ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి.
ప్రతిపక్షాల బలహీనతలను చూసి, తనకు వచ్చే ఎన్నికల్లో తిరుగు లేదని బహుశా కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు. కానీ, వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆయన కాళ్ల కిందికి నీళ్లు తెచ్చినా ఆశ్చర్యం లేదు. మూడెకరాల భూమి పంపిణీ పథకంలో తమకు అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇద్దరు దళిత యువకుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
మాంకాలి శ్రీనివాస్ అనే యువకుని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా జరిగింది..
మూడెకరాల భూపంపిణీలో అవకతవకలను నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామ వాసి మహంకాళి శ్రీనివాస్ (28), యాలాల పరశురాములు (30) అనే ఇద్దరు యువకులు నిరసనగా ఆగస్టు 15వ తేదీన ఆత్మాహుతి కావడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే రాకపోవడంతో పరశురాములు, మహంకాళి శ్రీనివాస్ వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయాలు కావడంతో తొలుత కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి.. తర్వాత హైదరాబాద్కు తరలించారు. మహంకాళి శ్రీనివాస్కు భార్య శ్రావణి, కుమారులు శశాంక్ (4), మణిదీప్ (3) ఉన్నారు. శ్రీనివాస్ - శ్రావణిలది ప్రేమ వివాహం. మహంకాళి శ్రీనివాస్ (27)కు వ్యవసాయ భూమి లేదు. కూలీ పనిచేసుకుంటూ చేసుకుంటూ జీవించే శ్రీనివాస్ ఇక్కడ ఉపాధి లేకపోవడంతో అప్పు చేసి గల్ఫ్కు వలస వెళ్లినా ఏజెంటు చేతిలో మోసపోవడంతో వెళ్లి తిరిగి వచ్చాడు.
ఇలా చేసినా కూడా..
సంఘటన జరిగిన వెంటనే మంత్రి ఈటెల రాజేందర్, పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, తదితరులు బాధితులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందేలా చూశారు. అయినా, బంధువులు, గ్రామస్థుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. మానకొండూర్లో మంగళవారం బీజేపీ ఆందోళన చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. కాంగ్రెస్, వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలు రాస్తారోకోలు నిర్వహించాయి. శంకరపట్నం మండల కేంద్రంలో కూడా దళితులు రాస్తారోకోకు దిగారు.
నేరెళ్ల ఘటనపై.
నేరెళ్ల ఘటన కెసిఆర్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఇసుక లారీల కింద పడి ప్రజలు మరణిస్తున్నవైనాన్ని నిరసిస్తూ పలు గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. ఈ నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది. దాన్ని ఆసరా చేసుకుని పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారు. ఈ నేరెళ్ల ఘటన జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల సంఘం, చివరకు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. హైకోర్టులో బాధితుల తరఫున వేసిన కేసు విచారణలో ఉంది.
ఎల్లారెడ్డి పేటలో...
నేరెళ్ల సంఘటనకు బాధ్యుడిగా భావించిన ఎస్సైను సస్పెండ్చేసి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ సంఘటనను మర్చిపోక ముందే ఎల్లారెడ్డిపేటలో దొంగతనం కేసులో ఓ దళితున్ని అరెస్టుచేసి పోలీసులు వారం రోజుల తర్వాత రిమాండ్ చేయగా అతను అస్వస్థతకు గురై రిమాండ్లో ఉన్నప్పుడే చనిపోయాడు. పోలీసుల దెబ్బల కారణంగానే అతను చనిపోయాడని అతని భార్య ఆరోపించింది. నిరసనకు దిగిన ఆమె చివరకు కనిపించకుండా పోయింది.