ప్రతీకారం: భారత్పై ఒత్తిడి, దెబ్బకు పాక్ ద్విముఖ వ్యూహం
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ దాడికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తోందా? జమ్ము కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా భారత దేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు.
రెండు వ్యూహాలతో పాకిస్తాన్
సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ పైన పాకిస్తాన్ రెండు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ, మరోవైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ ఇబ్బందులు సృష్టించాలని, తద్వారా భారత్ పైన ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రదాడి
ఇటీవలే ఇప్పటికి పాకిస్తాన్ ఎనిమిదిసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మరోవైపు వరుసగా ఉగ్రవాదులు జొరబడే ప్రయత్నాలు చేస్తున్నారు. యూరి ఆర్మీ క్యాంప్ పైన, ఆదివారం బారాముల్లా ఆర్మీ క్యాంప్ పైన, తాజాగా గురువారం ఉదయం హంద్వారా క్యాంప్ పైన ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
మూడుసార్లు దాడి
బారాముల్లా, హంద్వారాలో సైన్యం ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఓ వైపు పీవోకేలో కాల్పులు, మరోవైపు ఉగ్రవాద దాడులతో సైన్యం దృష్టిని పాకిస్తాన్ మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, భారత్లో స్లీపర్ సెల్స్ పైన దృష్టి సారించారు.
కాశ్మీర్ పైన జోక్యం
పైగా, జమ్ము కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవడం ద్వారా కూడా పాకిస్తాన్.. భారత్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. భారత భద్రతా దళాల కాల్పుల్లో హతమైన హిజుబుల్ ముజహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా మరోసారి ప్రశంసించాడు.
బుర్హన్ వానికి కితాబు
కాశ్మీర్ ఉద్యమం కోసం వనీ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమాయక ప్రజలను చంపి కాశ్మీర్ ఉద్యమాన్ని అణచలేరన్నాడు. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటని చెప్పాడు. ఐక్యరాజ్య సమితి వేదికగా నవాజ్ షరీఫ్ బుర్హన్ వానీని యువనేతగా ప్రశంసించిన విషయం తెలిసిందే.