సత్తా చాటిన భారత టెక్కీ: ఊహించని మొత్తానికి సిస్కోకు కంపెనీ అమ్మేశాడు
ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన తన కంపెనీని ప్రపంచ ప్రఖ్యాత నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కోకు విక్రయించి వార్తల్లో నిలిచాడు జ్యోతి బన్సల్.
ముంబై: ఊహించని మొత్తానికి తన కంపెనీని అమ్మేసి భారత సంతతికి చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సత్తా చాటాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన తన కంపెనీని ప్రపంచ ప్రఖ్యాత నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కోకు విక్రయించి వార్తల్లో నిలిచాడు. కంపెనీ విలువ కంటే రెట్టింపు మొత్తానికి సిస్కో ఆయన కంపెనీని కొనుగోలు చేయడం విశేషం.
ఢిల్లీ ఐఐటీలో చదివి అమెరికాలో స్థిరపడిన జ్యోతి బన్సల్ తన యాప్ డైనమిక్స్ కంపెనీని సిస్కోకు విక్రయించడం ద్వారా సంచలనంగా మారారు. 3.7 బిలియన్ డాలర్లకు సిస్కో ఈ అంకుర సంస్థను దక్కించుకుంది. అంతేగాక, అమ్మకం అనంతరం బన్సల్కు సంస్థలో 14శాతం వాటా కేటాయించింది.
వెంచర్ పెట్టుబడులు పోనూ వచ్చిన ఆదాయంలో రూ.3400 కోట్లు బన్సల్ సొంతం కానున్నాయి. 2 బిలియన్ డాలర్ల విలువతో యాప్ డైనమిక్స్ ఐపీవోకు వెళ్లడానికి సరిగ్గా ఒకరోజు ముందు ఈ డీల్ జరగడం కొసమెరుపు. దాదాపు కంపెనీ విలువకు రెట్టింపు మొత్తాన్ని చెల్లించేందుకు సిస్కో ముందుకు రావడం విశేషం.
200 డాలర్లతో మొదలైన కంపెనీ తారా స్థాయికి..
1999 ఢిల్లీ ఐఐటీలో పట్టా పొందిన బన్సల్ అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి ఇచ్చిన 200 డాలర్లతో సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టిన ఆయన 2005లో విలీ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగంలో చేరారు. దాదాపు రెండేళ్లపాటు ఉద్యోగం చేసిన బన్సల్ అనంతరం యాప్ డైనమిక్స్ సంస్థను ప్రారంభించాడు. తొలినాళ్లలో పెట్టుబడుల సమీకరణకు ఇబ్బంది పడిన అతడు తర్వాత 350 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాడు.
బన్సల్ స్థాపించిన యాప్ డైనమిక్స్లో 900 మంది పనిచేస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన మైబైల్ యాప్స్, వెబ్సైట్లో బగ్స్ అండ్ ఫిక్సెస్ను కనుగొనే సాఫ్ట్వేర్ను ఈ సంస్థ రూపొందించింది. కంపెనీలకు ఎంతో ఉపయోగకరమైన దీన్ని సిస్కో కొనుగోలు చేయడం గమనార్హం.
2013 తర్వాత ఆ సంస్థ ఇంత మొత్తానికి ఓ కంపెనీని కొనుగోలు చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ కొనుగోలు తమ ప్రయాణంలో సాయపడుతుందని సిస్కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా, కొనుగోలు అనంతరం కూడా ఈ కంపెనీకి సీఈవోగా డేవిడ్ వద్వానీనే కొనసాగనున్నారు. ఆయనను 2015లో బన్సల్ సీఈవోగా నియమించారు.