టాటా వేట: రేసులో నూయీ, నోయిల్ టాటా, ఎన్సి
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం తాత్కాలిక ఛైర్మన్ రతన్ టాటా సోమవారం బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, సైరస్ మిస్త్రీ స్థానంలో టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎవరనే అంశంపై మార్కెట్లో అప్పుడే భారీ స్పెక్యులేషన్ ప్రారంభమైంది.
ప్రస్తుతం టాటా సన్స్ కొత్త ఛైర్మన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేసులో చాలా మందే ఉన్నప్పటికీ ఇద్దరి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే పెప్సీకో సీఈఓ ఇంద్రానూయీ, టీసీఎస్ సీఈఓ ఎన్ చంద్రశేఖరన్ ఉన్నారు. కాగా, వీరితోపాటు టాటా ఇంటర్నేషనల్ సీఈఓ, రతన్ టాటా కజిన్ నోయిల్ టాటా, వొడాఫోన్ మాజీ సీఈఓ అరుణ్ శరిన్, టాటా గ్రూప్కు చెందిన ఇషాత్ హుస్సేన్, బి ముత్తురామన్లు మిస్త్రీ స్థానాన్ని భర్తీ చేసేందుకు పోటీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో టాటా సన్స్ గ్రూప్నకు అధిపతిని ఎంపిక చేసేందుకు ఒక సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టాటా సన్స్ నియమించిన సెర్చ్ కమిటీలో బ్రెయిన్ క్యాపిటల్ హెడ్ అమిత్ చంద్ర కూడా సభ్యులుగా ఉన్నారు. రెండు వారాల్లో ఛైర్మన్ పదవి ఎంపిక ప్రక్రయ మొదలవుతుందని టాటా సన్స్ గ్రూప్ కోసం పని చేస్తున్న ఓ కన్సల్టెంట్ చెప్పారు.
ఇంద్రానూయీ, నోయిల్ టాటా ఈ రేసులో ముందున్నారని తెలిపాడు. నోయిల్ టాటా.. టాటా కుటుంబంలో ఒకరు కాగా, ఇంద్రానూయీ తన సామర్థ్యంతో అంతర్జాతీయ సంస్థను నడిపిస్తూ గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. వీరిద్దరి మధ్యే పోటీ ఉండవచ్చని చెప్పారు. ఎంపిక ప్రక్రియ మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటుందని వివరించారు. టాటా సన్స్కు సమర్థవంతమైన నాయకుడ్నే ఎంపిక చేయడం జరుగుతుందని మరో ఎంపిక కమిటీ సభ్యుడు తెలిపారు.
అయితే, 15 దశాబ్దాల చరిత్ర, మరే కార్పొరేట్ సంస్థకూ లేని స్థిరత్వం, సామాజిక చింతనతో కూడిన వ్యాపార విలువలున్న టాటా గ్రూప్నకు సారధ్య బాధ్యతలు వహించడం అంత తేలికైన విషయం కాదు. దేశంలో మరే కార్పొరేట్ గ్రూప్నకు లేని గౌరవం, ఆదరణ ప్రజల్లో టాటా గ్రూప్నకు ఉందంటే కారణం ఆ సంస్థ ఆచరించే విలువలేనని అర్థమవుతోంది.
సంస్థ స్థిరత్వం కోసమే సైరస్ మిస్త్రీ స్థానంలో తాత్కాలిక చైర్మన్ బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించనట్టు రతన్ టాటా గ్రూప్ కంపెనీల ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు. కొత్త చైర్మన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటైందని కూడా ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ఆ లేఖలో ఆయన తెలిపారు.
కాగా, టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి చట్ట విరుద్ధంగా ఉద్వాసన చెప్పడంపై ఆయన కుటుంబం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనిపై న్యాయపోరాటం కోసం సిద్ధపడుతున్న మిస్త్రీ కుటుంబ వర్గాలు తెలిపాయి. టాటా సన్స్లో సైరస్ మిస్త్రీ కుటుంబానికి 18.4 శాతం వాటా ఉంది.
ఇదిలా ఉండగా మిస్త్రీ కుటుంబం నుంచి న్యాయపరమైన ప్రతిఘటన ఉంటుందని ఊహించిన టాటా గ్రూప్ కూడా న్యాయకోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా టాటా సన్స్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలను వివరిస్తూ రతన్ టాటా ప్రధాని మోడీకి కూడా ఒక లేఖ రాశారు.