ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగొద్దు: ఆ నలుగురికి సుప్రీం
ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైన నలుగురు సమాచార కమిషనర్లపై తక్షణం వేటు వేయాలని సుప్రీం కోర్టు చెప్పింది. వారి నియామకాలను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైన నలుగురు సమాచార కమిషనర్లపై తక్షణం వేటు వేయాలని సుప్రీం కోర్టు చెప్పింది. వారి నియామకాలను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
సమాచార కమిషనర్లుగా ఉన్న వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయ నిర్మలలు ఆ పదవుల్లో ఉండేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.
అది చాలా గౌరవప్రదమైన స్థానమని, తాము బాగా పని చేస్తున్నామని, పదవీ కాలం పూర్తయ్యేదాకా కొనసాగించాలని ఆ నలుగురు చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.
మీరు ఎలా పని చేస్తున్నారనేది ప్రశ్న కాదని, అసలు మీరు ఎలా నియమితులయ్యారన్నదే అసలు ప్రశ్న అని తేల్చి చెప్పింది. సమాచార కమిషనర్లుగా నియమితులయ్యేందుకే మీకు అర్హత లేదని, కాబట్టి ఒక్క క్షణం కూడా ఆ పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2011 డిసెంబర్ 14న నాటీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది మందిని సమాచార కమిషనర్లుగా ప్రతిపాదిస్తూ గవర్నర్కు ఫైలు పంపింది. 2012 జనవరి 31న కమిషనర్ల నియామకంపై ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీ భేటీ జరిగింది. ఈ ప్రతిపాదనలను గవర్నర్కు కమిటీ సిఫారసు చేసింది.
అయితే, ఇందులో మధుకర్ బాబు, ప్రభాకర రెడ్డి, విజయ బాబు, ఎం రత్నలను మాత్రమే సమాచార కమిషనర్లుగా గవర్నర్ నియమించారు. వెంకటేశ్వర్లు, లాం తాంతియాకుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల పేర్లను తొలగించారు. వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇంతియాజ్ అహ్మద్ టిడిపి నేత. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేశారు.
విజయనిర్మల ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా నూజివీడు నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈమె మినహా మిగతా ముగ్గురూ హైకోర్టులో న్యాయవాదులు. రాజకీయ పార్టీల సభ్యత్వం ఉన్న వీరిని సమాచార కమిషనర్లుగా నియమించాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ ఆ ఫైలును తిప్పిపంపారు.
కానీ, ప్రభుత్వం 2013 జనవరిలో మరోసారి గవర్నర్కు ఫైలును పంపింది. అదే ఏడాది ఫిబ్రవరి 6న ఈ నలుగురూ సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరి నియమాకాలు అక్రమమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పద్మనాభయ్య(హోం శాఖ మాజీ కార్యదర్శి) హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆ నలుగురి నియామకాలను రద్దు చేస్తూ 2013 సెప్టెంబర్ 12న తీర్పు ఇచ్చింది. వారు సుప్రీంలో సవాల్ చేశారు. ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ఈ నలుగురూ సమాచార కమిషనర్లుగా కొనసాగుతున్నారు.
కేసు విచారణను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ క్రిషన కౌల్ల ధర్మాసనం చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గురుకృష్ణకుమార్, పద్మనాభయ్య తరఫున న్యాయవాది ఆర్ చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది పాల్వాయి వెంకట్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ హాజరయ్యారు.
రాజకీయ పార్టీల్లో సభ్యత్వం కలిగి ఉన్న వీరు నియామకాలకు అనర్హులు అని, వెంకటేశ్వ ర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్ ముగ్గురూ హైకోర్టులో న్యాయవాదులని, న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా తమను అయిదేళ్లు తప్పించాలని బార్ కౌన్సిల్కు విజ్ఞప్తి చేయలేదని చంద్రశేఖర రెడ్డి తెలిపారు.
అయితే తమకు పార్టీలతో సంబంధం లేదని, విరుద్ధ ప్రయోజనాలు కలిగిన ఏ పదవిలోనూ కొనసాగటం లేదని అప్పట్లోనే ఒక అఫిడవిట్ను ఇచ్చామని ఆ నలుగురి తరఫు న్యాయవాది గురుకృష్ణ కుమార్ తెలిపారు.
అలాంటి పత్రాలేవీ లేనందునే వారి నియామకాలు రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో చెప్పిందని జస్టిస్ ఖేహర్ గుర్తు చేశారు. వాటిని ఇప్పుడు సమర్పిస్తామని గురుకృష్ణ కుమార్ చెప్పగా... వాటిని పరిగణలోకి తీసుకోమని జడ్జి స్పష్టం చేశారు.
అంతేకాకుండా, అఫిడవిట్లు ఇస్తే సరిపోదని, రాజీనామా చేసినట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని చెప్పారు. అయినా, వీరిని ఇంత కాలం కొనసాగనిచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు. వారి పదవీ కాలం మరో పది నెలలే ఉందని చెప్పినప్పటికీ సుప్రీం కోర్టు ససేమీరా అంది.