తెలంగాణలో ఇంటింటికీ నల్లాతోపాటు ఇంటర్నెట్ కూడా
న్యూఢిల్లీ: తెలంగాణలో వాటర్ గ్రిడ్తో పాటు ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ కూడా వేయబోతున్నామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం అన్నారు. దీంతో ఇంటింటికి నల్లాతో పాటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందుతుందని చెప్పారు.
శనివారం ఆయన సోషల్ మీడియా పైన నిర్వహించిన సదస్సులో ఢిల్లీలో మాట్లాడారు. దేశంలో ఇలాంటి సౌకర్యాన్ని మొట్టమొదట కల్పించబోయేది తమ రాష్ట్రమే అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫేస్బుక్ పేజీకి ఇతర రాష్ట్రాల సిఎంలకన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పారు.
ప్రజలకు, పాలకులకు ప్రత్యక్ష సంధానం, సంభాషణల వల్ల అధికారుల్లో అప్రమత్తత పెరిగి, అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రజా సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపిస్తే ఈ విధానం విజయవంతమవుతుందని కెటిఆర్ చెప్పారు.
తెలంగాణలోని ప్రతి ఇంట్లో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 'సుపరిపాలన సుస్థిర అభివృద్ధి- సామాజిక మాధ్యమాల పాత్ర'పై ఢిల్లీలో భారత్ నీతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సును భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ప్రారంభించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజలకు సేవ, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చించిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, లోక్సత్తా జాతీయాధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణలో వివిధ పథకాల్లో ప్రజలకు నేరుగా సేవలు ఎలా అందుతున్నాయో కేటీఆర్ వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 2 నుంచి తెలంగాణలో ఈ-పంచాయతీ విధానాన్ని ప్రారంభిస్తామన్నారు.
ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకే నేరుగా ఫలాలు అందుతాయన్నారు. ప్రస్తుతం ప్రజలు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని నేరుగా మంత్రులు, ముఖ్యమంత్రులకు సమస్యలు వివరించగలుతున్నారన్నారు.
తెలంగాణలోనూ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో సాంకేతిక అక్షరాస్యత పెంచడానికి ఇంటింటికీ నల్లా తరహాలో ఇంటింటికీ బ్రాడ్బ్యాండ్ అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలు ఉన్నాయన్నారు.
రానున్న ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా సాంకేతిక అక్ష్యరాస్యత సాధించేలా చూడడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకు సామాజిక మాధ్యమాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతికి చెందిన అనేక ఉత్పత్తులు అంతర్జాలం ద్వారా ప్రపంచ విపణికి చేరుకొనేందుకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.