కరీం 'పెద్ద జాదూ': ఇలా హైటెక్ కాపీయింగ్.., సురేష్ గోపీ స్ఫూర్తి, విస్తుపోవాల్సిందే!
Recommended Video
చెన్నై: కరీం హైటెక్ మాస్ కాపీయింగ్ తో యూపీఎస్సి పరీక్షల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 2014లో సివిల్స్ టాపర్ గా నిలిచిన కరీం.. అప్పుడు కూడా హైటెక్ మాస్ కాపీయింగ్కు పాల్పడి ఉంటాడా? అన్న అనుమానాలు ముసురుకున్నాయి.
యూపీఎస్సి పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్: ఐపీఎస్ సఫీర్ కరీం అరెస్ట్, హైదరాబాద్ నుంచే అంతా!
ఐపీఎస్గా కొనసాగుతూనే.. కొచ్చి, కాలికట్, భోపాల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు నెలకొల్పాడు కరీం. ఆ కోచింగ్ సెంటర్స్ ముందున్న యాడ్స్ లో కరీం 2014సివిల్స్ టాపర్ అనే ఫోటో ప్రధానంగా కనిపిస్తోంది.
కోచింగ్ సెంటర్ల కోసమే
తాను ఐఏఎస్ టాపర్ గా నిలిస్తే.. తన కోచింగ్ సెంటర్లకు ఎక్కువమందిని ఆకర్షించవచ్చునని కరీం భావించి ఉండవచ్చు. ఇందుకోసం అతను హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా ర్యాంక్ సాధించి.. దాన్ని తన ఇనిస్టిట్యూట్ గొప్పతనంగా ప్రచారం చేసుకోవాలని ఉంటాడు.
సురేశ్ గోపీ పోలీస్ పాత్రలే స్ఫూర్తి
కరీం ప్రస్తుతం తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో అసిస్టెంట్ సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో సురేష్ గోపీ పోలీసు పాత్రలను చూసి తాను స్పూర్తి పొందినట్టు కరీం 2015లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అప్పట్లో ఐపీఎస్ ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు కూడా సురేష్ గోపీ 'కమిషనర్' సినిమా చూసి వెళ్లినట్టు ఇంటర్వ్యూలో చెప్పాడు.
అందులో సురేష్ గోపీ భరత్ చంద్రన్ ఐపీఎస్ పాత్ర ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఐపీఎస్ అయినట్టు చెప్పుకొచ్చాడు. ఐపీఎస్ అయ్యాక గోపీని ప్రత్యేకంగా కలిసి తన అభిమానం చాటుకున్నాడు. సివిల్స్ పరీక్షను అతను వీడియో గేమ్ తో పోల్చడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
కేరళలో పాపులర్:
కేరళలో ఐపీఎస్ కరీంకు చాలా పాపులారిటీ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అతను ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అతని కోచింగ్ సెంటర్ లలో ఉన్న యాడ్స్ లో 'మెయిన్స్ ఆప్షనల్ సోషియాలజీ 2016, ఐపీఎస్ సఫీర్ కరీంతో బోధించబడును(సోషియాలజీ టాపర్, 112వ ర్యాంకు-2014) అని రాసి ఉంది. కేరళ నం.1 ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ఇక ఫ్యాకల్టీ అంతా ఒకే గొడుగు కింద అనే ట్యాగ్ లైన్ తో అక్కడి కోచింగ్ సెంటర్ ముందు మరో యాడ్ కూడా కనిపిస్తోంది.
ఇలా కాపీయింగ్:
హైటెక్ మాస్ కాపీయింగ్ కోసం కరీం బాగానే కసరత్తులు చేశాడు. ర్క్నెట్లో అక్రమ మార్గాలపై లోతుగానే పరిశోధన చేశాడు. అలా బ్లూటూత్, సాక్సులో సెల్ ఫోన్, వైర్లెస్ హియర్ ఫోన్స్, షర్టు బటన్లో ఎవరికీ కనిపించకుండా ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా సఫీర్ కరీం పరీక్ష హాల్లోకి ప్రవేశించాడు.
ఛాతి భాగంలో ఉన్న మైక్రో కెమెరా ద్వారా ప్రశ్నా పత్రాన్ని స్కాన్ చేసి భార్యకు పంపించాడు. ఇంటర్నెట్ లింకప్ అయి ఉన్న కెమెరా కావడంతో.. గూగుల్ డ్రైవ్ ద్వారా భార్యకు ప్రశ్నాపత్రం చేరింది. అలా ఆమె సమాధానాలు చెబుతుంటే తాను రాస్తూ వచ్చాడు. పరీక్ష మొదలైన 20నిమిషాల తర్వాత పరీక్ష హాల్లోకి వచ్చిన ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు.. కరీంను చెక్ చేయగా ఈ వ్యహారం బయటపడింది.
అరెస్టులు:
హైదరాబాద్ అశోక్ నగర్ లోని 'లా ఎక్సలెన్స్ స్టడీ సర్కిల్' నుంచి కరీం భార్య జాయిసీ అతనికి సమాధానాలు చేరవేసినట్టు తేల్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించగా అతని భార్య జాయిసీతో పాటు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ పి.రాంబాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ నగర్ లో ఉన్న లా ఎక్సలెన్సీ అకాడమీలో ఆమె ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వారిని చెన్నై డీసీపీ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ ప్రశ్నిస్తోంది.
ప్రిలిమ్స్ లోను మోసమే:
ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన ఐఏఎస్ ప్రిలిమ్స్ లోను కరీం ఇదే తరహా మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అప్పుడు కూడా ఇలాగే మైక్రో కెమెరా ఆధారంగా కాపీకి పాల్పడినట్టు చెబుతున్నారు. భార్య వాయిస్ సరిగా వినిపించనప్పుడు.. 'గొంతు సరిగా వినిపించడం లేదు' అంటూ పెన్సిల్ తో రాసి పంపించేవాడు. అలా కాపీయింగ్కు పాల్పడి ప్రిలిమ్స్ సాధించాడు. సఫీర్ అరెస్ట్ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.