రేవంత్ రెడ్డి టార్గెట్ వెనుక కులం కోణం ఉందా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి వ్యవహారంలో రోజుకో మలుపు కనిపిస్తోంది. తెరాస, టీడీపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో బలమైన ఓ సామాజిక వర్గాన్ని అణిచివేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ బలమైన సామాజిక వర్గాన్ని అణిచి వేయాలన్న లక్ష్యంతో తెరాస ప్రభుత్వం, కేసీఆర్ ముందుకెళ్తున్నారని తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. రెడ్డి సామాజిక వర్గాన్ని అణిచివేయాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ముందుకుపోతున్నారనేది ఆయన భావనగా తెలుస్తోందంటున్నారు.
ఈ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డిని అన్యాయంగా ఇరికించారని వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ కేసుకు సంబంధించిన ఫుటేజీని తమకు కావాల్సిన విధంగా మార్చుకొని, కొందరు నేతలు విడుదల చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఇందుకోసం తన తెలివితేటలు ఉపయోగిస్తున్నారన్నారు.
కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో పలు అంశాల పైన సూటిగా స్పందించారు. ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని, 2019లో తానే సీఎం క్యాండెట్ అని కుండబద్దలు కొట్టారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రతి అంశాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేందుకు వెనకాడతారు.
కానీ, రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని నేరుగా చెప్పేశారు. అదే సమయంలో తెలంగాణలో రెడ్డి, వెలమ రాజకీయాల మధ్య ఆధిపత్య పోరు నెలకొందని చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ నిత్యం తనను టార్గెట్ చేయడం, పలు అంశాల్లో ఇరుకున పెట్టడం, సామాజిక వర్గం, బద్ద వ్యతిరేకి అయిన టీడీపీలో ఉండటం.. ఇలా అన్ని అంశాలు కలిసి వచ్చి రేవంత్ను ఇరికించారనే వాదనలు వినిపిస్తున్నాయి.