నాసిరకం బతుకమ్మ చీరెలు: కెటీఆర్ తీరు, సిరిసిల్ల ఒక్కటేనా...
'చూడు.. ఒకవైపే చూడు..' అన్నది ఒక సినిమాలో ప్రముఖ సినీ నటుడి డైలాగ్. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యవహార శైలి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తున్నది.
హైదరాబాద్: 'చూడు.. ఒకవైపే చూడు..' అన్నది ఒక సినిమాలో ప్రముఖ సినీ నటుడి డైలాగ్. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యవహార శైలి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆయన తెలంగాణ అంతటికీ చేనేత, జౌళిశాఖ మంత్రి.
దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నాటి టీఆర్ఎస్ అధినేత - ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని అన్ని హ్యాండ్లూమ్, పవర్లూమ్ కేంద్రాల్లోని కార్మికులకు చాలినంత ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీనిచ్చారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ సర్కార్ ప్రధానంగా సిరిసిల్లపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు నటిస్తూ అధికార యంత్రాంగం సిరిసిల్లతోపాటు రాష్ట్రంలోని చేనేత కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
చివరి క్షణంలో ఆర్డర్లు ఇచ్చి.. మధ్యలోనే పని పూర్తి చేయలేదని తేల్చేసి.. ఇతర మార్గాల్లో దుస్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయని రాష్ట్ర పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ మొదలు తాజాగా బతుకమ్మ చీరల పంపిణీ వరకు సాగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సకాలంలో ఆర్డర్లు ఇవ్వనందునే సూరత్ తదితర ప్రాంతాల నుంచి చాలా మామూలు రకం బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి వచ్చిందని తెలుస్తున్నది
అత్యధికంగా ఆత్మహత్యలు సిరిసిల్లలోనే
ఎవరు ఎంత కేంద్రీకరించినా నిజానికి అక్కడి మరమగ్గాల కార్మికుల జీవితాలు అత్యంత దుర్భరంగా ఉంటున్నాయి. చాలీచాలని వేతనాలు, అప్పుల భారం.. వెరసి రాష్ట్రంలోనే అత్యధిక మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నది సిరిసిల్లలోనే అంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ పరంపర కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితి మారలేదు. మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలోనూ రాష్ట్రవ్యాప్తంగా 46 మంది చేనేత, మరమగ్గం కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే, అత్యధికంగా 30 మంది సిరిసిల్లవారే కావటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్న నేతన్నలు
రాష్ట్రంలోని ఇతర చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన పరిస్థితులు కూడా ఇందుకు భిన్నంగా లేవు. ఉపాధి లేక, ఒకవేళ ఉన్నా వేతనాలు సరిపోక వారు భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా అవతారమెత్తుతున్నారు. మరికొంత మంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకూ వలసలు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి ఉపాధి భద్రత, వృత్తి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చేనేత రంగ నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 17 వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత సంఘాల సర్వే ప్రకారం ఇవి దాదాపు 25 వేలకుపైనే ఉన్నాయని అంచనా.
మరమగ్గాలతో మరో లక్ష మందికి ఉపాధి
నూలుమగ్గం మీద వస్త్రం నేసే కార్మికుడికి సహాయం చేసేందుకు.. నాలుగు రకాల అనుబంధ పనులు చేయటానికి నలుగురు మనుషులు అవసరం అవుతారు. రంగులద్దటం, బీములు పోయటం, వార్పుపని, చిటికీలు అద్దటం.. తదితర పనులను వారు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రకారంగా రాష్ట్రంలో చేనేత, దాని అనుబంధ వృత్తులు చేసేవారు లక్షన్నర దాకా ఉన్నారన్నమాట. మరోవైపు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కలిపి 60 వేల మరమగ్గాలు ఉన్నాయి.
వీటిపై ఆధారపడి మరో లక్ష మంది వరకూ జీవిస్తున్నారు. వీరందరికీ జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెబుతున్నారు. సిరిసిల్ల టౌన్ పరిసర ప్రాంతాలతోపాటు నల్లగొండ, భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కాటేదాన్, యాదాద్రి జిల్లాలో పోచంపల్లి, నారాయణపురం, వరంగల్ జిల్లలో వరంగల్ సిటీ, జనగామాలో జనగామ, బచ్చన్నపేట, గద్వాలలో గద్వాల టౌన్, అయిజ, రాజోలి, సిద్దిపేటలో సిద్దిపేట పట్టణం, దుబ్బాక, మిరిదొడ్డి, చేర్యాల, సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు నారాయణ్ ఖేడ్, అందోలు, రంగారెడ్డి జిల్లాలో ఎల్బీ నగర్, హాయత్ నగర్, కుంట్లూరు, కొత్త పేట ప్రాంతాల్లో చేనేతకార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థుల యూనిఫామ్ కొనుగోళ్లు
వాస్తవంగా రాష్ట్రంలోని చేనేత, మరమగ్గం కార్మికులకు ఉపాధి కల్పిస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత కొంత హడావుడి చేసింది. వారానికొక రోజు ‘చేనేత' దుస్తులు ధరించాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ సిఫారసు చేశారు. అది వేరే సంగతనుకోండి. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా స్కూల్ యూనిఫారాలు తయారు చేయించాలని నిర్ణయించింది. కానీ సకాలంలో అందుకు సంబంధించిన ఆర్డర్లు ఇవ్వకపోవటంతో వస్త్రాల తయారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో సిరిసిల్లతోపాటు ఇతర కేంద్రాలకు యూనిఫారాలు తయారు చేసే సామర్థ్యం లేదని అధికారులు ఆర్డర్లను వెనక్కు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్త్రాలను తెప్పించి పాఠశాలలకు పంపిణీ చేశారు.
సిరిసిల్ల కార్మికులు ఉక్కిరిబిక్కిరి ఇలా
బతుకమ్మ చీరల విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఇవ్వాల్సిన ఆర్డర్లను.. ఆఘమేఘాల మీద జూన్లో ఇవ్వటంతో సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలోనే 50 లక్షల చీరలను సూరత్ నుండి తెప్పించటం, అవి నాసిరకంగా ఉండటంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల మరమగ్గం కార్మికులకు కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరగటం లేదు. అందువల్ల సిరిసిల్లతోపాటు రాష్ట్రంలోని అన్ని చేనేత, మరమగ్గాల కేంద్రాలకు తగిన నిధులు కేటాయించి, వాటిని అభివృద్ధిపరచాలని చేనేత కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా అక్కడి కార్మికులకు ఉపాధి భద్రత, వృత్తిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.