మోడీకి పరీక్ష: దూకుడుకు అడ్డుకట్ట కష్టమేనా?
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ భవితవ్యం నేడు తేలనుందా? అంటే అవుననే అంటున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో మోడీ పైన చర్చ సాగుతోంది. నాలుగింట మూడు రాష్ట్రాల్లో బిజెపి గెలుస్తుందని సర్వేలు వెల్లడించాయి.
బిజెపి గెలిచినా, ఓడినా ఆ ప్రభావం మోడీ పైన కచ్చితంగా ఉంటుందంటున్నారు. బిజెపి గెలిస్తే మోడీ ప్రభావంతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్లకూ క్రెడిట్ దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే రమణ్, శివరాజ్ సింగ్ల అభివృద్ధి, వసుంధరల కారణంగానే మూడు రాష్ట్రాల్లో గెలిచిందంటారు. మోడీకి క్రెడిట్ దక్కినా వారి పాత్రను ముఖ్యంగా చెబుతారు. ఓడిపోతే మాత్రం మోడీని టార్గెట్ చేసుకుంటారంటున్నారు. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు మోడీకి పరీక్షనే అంటున్నారు.
ఇప్పటికే పార్టీలో మోడీ మానియా నెలకొందని, ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసేవారు ఉండరని, కాబట్టి మిశ్రమ ఫలితాలు రావడమే మంచిదని బిజెపిలోని ఆయన వ్యతిరేక వర్గం కూడా భావిస్తోందని గతంలో ప్రచారం జరిగింది. మిశ్రమ ఫలితాలు వస్తే మోడీ దూకుడు తగ్గుతుందని వారు భావిస్తున్నారట.
ప్రీ ఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం గాలి వీచిందని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని, ఢిల్లీలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ బిజెపికే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చాయి. దీంతో మోడీ మేజిక్ పని చేసిందా అనే చర్చ సాగింది.. సాగుతోంది. మోడీ ప్రభావం కనిపించిందని కొందరు చెబుతుంటే, అలాంటిదేం లేదని మరికొందరు అంటున్నారు.
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఆయా ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకత, వసుంధర రాజే ప్రభావంతోనే బిజెపి అధికారంలోకి రానుందని అంటున్నారు. ఢిల్లీలో మూడు పర్యాయాలు ఏలిన షీలాదీక్షిత్ ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల బిజెపి గట్టెక్కుతోందంటున్నారు.
అయితే మోడీ వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 8వ తేదిన ఫలితాలు రానున్నాయి. ఏ సర్వేలు ఏం చెప్పాయి? మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి సర్కారు వరుసగా మూడోసారి 'క్లీన్ స్వీప్' చేస్తుందని 'ఇండియా టుడే - ఓఆర్జీ మార్గ్' ఎగ్జిట్ పోల్ పేర్కొంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో 138 బిజెపికి దక్కుతాయని, కాంగ్రెస్ 80తో సరిపెట్టుకుంటుందని తెలిపింది.
ఇక ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్కు మరోసారీ తిరుగుండదని ఈ సర్వే తెలిపింది. అక్కడ బిజెపికి 53 స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్ 33 సీట్లతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. రాజస్థాన్లో ఇన్నాళ్లుగా విపక్షపాత్రకు పరిమితమైన బిజెపి ఇక అధికారంలోకి రావడం ఖాయమని హెడ్లైన్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 200 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కమలం 110 చోట్ల వికసిస్తుందని, కాంగ్రెస్ 62 సీట్లకు పరిమితమవుతుందని ఈ ఫలితాల్లో తేలింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్కు ప్రభుత్వ వ్యతిరేక సెగ తప్పదని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. ఢిల్లీలో 'సరికొత్తగా తెరపైకి వచ్చి సంచలనాలు సృష్టిస్తుంది' అనుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి చేరువ కాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్ని సర్వేలు తెలిపాయి.