అవిశ్వాసంపై ఉత్కంఠ: ఈరోజైనా చర్చకు వస్తుందా!, జగన్ ప్రకటన సంచలనమే?..
Recommended Video
అమరావతి/న్యూఢిల్లీ: పార్లమెంటు మలివిడుత సమావేశాలు క్లైమాక్స్కు చేరుకున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా కేంద్రం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతే.. కేంద్రాన్ని ప్రత్యక్షంగా నిలదీయడానికి మరో అవకాశం ఉండదు కాబట్టి.. సోమవారం లోక్సభ ఎజెండాలో అవిశ్వాసానికి చోటు ఉంటుందా.. ఉండదా? అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోన్న విషయం.
బాబు మంతనాలు:
కేంద్రంపై పోరును మరింత ఉధృతం చేసేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పలు పార్టీల అధినేతలు, అధినేత్రులతో మంతనాలు జరపనున్నారు. మరోసారి టీడీపీ అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. దానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏపీ విషయంలో ప్రధాని మోడీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గతంలో తిరుపతి సభలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను కూడా చంద్రబాబు వివిధ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట.
జగన్ ప్రయత్నాలు..:
ఇక తొలి నుంచి హోదా కోసం గట్టిగా ఫైట్ చేస్తున్న వైసీపీ.. చివరి దశలో మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. వైసీపీకి బీజేపీతో లింకులు అంటగడుతున్న నేపథ్యంలో.. దాన్ని ఎండగడుతూనే తమ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
తొమ్మిదోసారి అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీ స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో అన్ని పార్టీల మద్దతు కోరుతూ అధినేత జగన్ ఇప్పటికే పలువురు అధినేతలకు లేఖలు రాశారు. ఎంపీలు సైతం ఆయా పార్టీల నాయకులను కలిసి సహకరించాల్సిందిగా కోరుతున్నారు.
లేఖలు రాసిన జగన్:
హోదాపై ఫైట్ చేస్తున్న క్రెడిట్ ప్రత్యర్థి పార్టీకి దక్కకుండా ఉండటానికి వైసీపీ, టీడీపీ పరస్పరం విమర్శలతో దాడి చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ అవినీతి అంశాలను ఆయా పార్టీల వద్ద ప్రస్తావించి.. దాన్ని హైలైట్ చేయాలని టీడీపీ భావిస్తోంది.
హోదాపై మద్దతు విషయంలో ఆయా పార్టీల అధినేతలు, అధినేత్రులను సంప్రదిస్తున్న చంద్రబాబు.. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల అవినీతి అంశాలను కూడా ప్రస్తావించాలనుకుంటున్నారట. ఆర్థిక నేరస్తులకు ప్రధాని ప్రాముఖ్యత ఇస్తున్నాడని వాళ్లతో చెబుతారట.
సంచలనమే:
హోదా విషయంలో రాజీనామాలకు, అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కంటే ముందే ఉన్న వైసీపీ.. ఇప్పుడు ఏకంగా ఆమరణ దీక్షకు కూడా సిద్దమంటూ ప్రకటించడం సంచలనమే.
ఐదుగురు సిట్టింగ్ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఢిల్లీలో ఆమరణదీక్ష చేయించడం ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించవచ్చునని వైసీపీ భావిస్తోంది. అటు రాష్ట్ర ప్రయోజనాలకు, ఇటు పార్టీకి ఇది లాభిస్తోందని భావిస్తోంది. మరోవైపు లోక్ సభలో నిరసనలు తెలపకుండా.. తమకు సహకరించాలని అన్నాడీఎంకె నేతలను సైతం వైసీపీ కోరుతోంది.