పన్నీర్: రాజీనామా ఉపసంహరణ సాధ్యమా?
శశికళ గురించి ఎంజీఆర్ అప్పట్లో జయలలితను హెచ్చరించిన విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఓ జ్యోతిష్కుడి మాటను పట్టుకుని శశికళ సిఎం పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది.
చెన్నై: తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, తనకు శాసనసభలో బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావును కోరారు. అది సాధ్యమవుతుందా అనేది అసలు ప్రశ్న.
శశికళ తనను బలవంతగా రాజీనామా చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ పరిస్థితిలో రాజీనామా ఉపసంహరణ సాధ్యమవుతుందా అనే సందేహం తలెత్తుతోంది. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించడమే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు.
ఇప్పుడు పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. అదే సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఆయనకు ఉండదంటున్నారు. అందువల్ల పోయెస్ గార్డెన్ను మ్యూజియంగా మార్చాలంటూ ఇచ్చిన ఆదేశాలు కూడా చెల్లకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే, పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో పాటు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా ఆదేశాలు జారీ చేశారని, అందువల్ల రాజీనామా ఉపసంహరణ సాధ్యం కాదని మద్రాసు హైకోర్టుకు చెందిన న్యాయవాది బాలకనకరాజ్ వాదిస్తున్నారు.
రాజీనామా ఉపసంహరణ అనే విషయాన్ని పక్కన పెట్టి తనకు మద్దతుగా నిలిచిన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరవచ్చునని అంటున్నారు. అయితే, శశికళ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనంత మాత్రాన ముఖ్యమంత్రి కావాలని కూడా ఏమీ లేదు. అందువల్ల బలనిరూపణకు గవర్నర్ ఇద్దరిలో ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చు. అదే సమయంలో రాష్ట్రపతి పాలనకకు సిఫార్సు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.