బాబు ప్రతీకారం: జగన్ సిద్ధమయ్యారా, అక్కడే ఢీలా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన పైన ప్రతీకారం తీర్చుకుంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారా? అంటే ఆయన వ్యాఖ్యలను చూస్తే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫళితాలలో అనూహ్య ఓటమి అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ... తనను ఇంతకాలం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వేధించారని, ఇప్పుడు చంద్రబాబు వంతు వస్తుందేమోనని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చంద్రబాబు తనను టార్గెట్ చేసుకుంటారని జగన్ మానసికంగా సిద్ధమైనట్లుగా తెలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు తన ప్రచారంలో కూడా జగన్ అవినీతితో సంపాదించిన సొమ్మునంతా కక్కిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పైన చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్, చంద్రబాబుల మధ్య విభేదాలు లేదా వైరం రాజకీయాలను దాటి పోయాయనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పైన చంద్రబాబు వైఖరిపై చర్చ సాగుతోంది.
అవినీతి జగన్ను తాను వదిలేసినా కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ వదిలి పెట్టరని చంద్రబాబు ఓ పత్రికా ముఖాముఖీలో కూడా చెప్పారు. జగన్ కూడా.. సోనియా వేధించారని, ఇప్పుడు చంద్రబాబు వంతు వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.
ఢీలాపడ్డ జగన్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో వైయస్ జగన్ ఢీలా పడ్డారు. ప్రజలు భారీ మెజారిటీ కట్టపెడతారని సిఎం కుర్చీలో కూర్చోవడమే తరువాయి అని భావించిన ఆయన ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు సమాచారం. మునిసిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాల సరళితోనే జగన్కు బెంగపట్టుకుందంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ఆయనకు విషయం అర్థమైపోయిందని అంటున్నారు.
శుక్రవారం నుంచి ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదట. ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నారట. జగన్ను కలసి నాలుగు ఓదార్పు మాటలు చెప్పాలని కొందరు భావించినా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందట. మరికొందరు ఫోన్లు చేస్తున్నప్పటికీ ఆయన అందుబాటులోకి రావడం లేదట. మునిసిపల్, పరిషత్ ఫలితాల విడుదల సమయంలో డెహ్రాడూన్లో ఉన్న జగన్ అక్కడే ఢీలా పడిపోయారట.