రికార్డు ప్రయోగాల ఇస్రో: సంపాదనలోనూ అదుర్సే!
ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో.. భారత కీర్తి ప్రతిష్టలను మరోసారి ప్రపంచానికి చాటింది. అయితే, రాకెట్ ప్రయోగాలతోపాటు రాబడిలోనూ ముందుకు దూసుకెళుతోంది.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత ప్రయోగాలతో దూసుకెళుతోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో.. భారత కీర్తి ప్రతిష్టలను మరోసారి ప్రపంచానికి చాటింది. అయితే, రాకెట్ ప్రయోగాలతోపాటు రాబడిలోనూ ముందుకు దూసుకెళుతోంది ఇస్రో. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్(శ్రీహరికోట) నుంచి నింగిలోకి పంపుతున్న విదేశీ ఉపగ్రహాల ద్వారా ఏటా రూ.కోట్లలో రాబడి వస్తోంది.
చరిత్ర సృష్టించిన ఇస్రో: 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ-సీ37
కాగా, ఇస్రోకు ఈ ఏడాది రూ.1,790 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇస్రో తన వాణిజ్య వ్యవహారాలు చూసేందుకు 1992లో యాంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇస్రో ఇప్పటి వరకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి విదేశాలకు చెందిన 180 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.
శ్రీహరికోట నుంచి మొదటగా పొలార్ శాటిలైట్ లాంచ్-సి2 (పీఎస్ఎల్వీ) వాహకనౌక ద్వారా 26-5-1999లో జర్మనీ, రిపబ్లిక్ కొరియాకు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు. గత పదేళ్ల నుంచి నేటి వరకు ఇస్రో 60 ప్రయోగాలు చేసింది. వీటి ద్వారా 225 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశ పెట్టింది. ఇందులో 22 దేశాలకు చెందిన 180 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపింది.
అంతేగాక, గడిచిన 23 ఏళ్లలో ఇస్రోకు యాంత్రిక్స్ ద్వారా రూ.4,408 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో విదేశీ ఉపగ్రహాలను పంపడంతోపాటు, ట్రాన్స్ఫాండర్స్ను ప్రైవేటు కంపెనీలకు విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది.
అంతరిక్ష ప్రయోగాలకు రూపాయి పెట్టుబడి పెడితే రూ.2 రాబడి రూపేణ ఇస్రోకు వస్తోందని సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఒకరు చెప్పడం గమనార్హం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఒక కిలో బరువును కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు 15వేల డాలర్లు వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం రాకెట్కు అమర్చే బూస్టర్లు సముద్రంలో కలిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్లను పలుమార్లు వినియోగించేలా తయారు చేయాలని కూడా ఇస్రో ఆలోచిస్తోంది. దీని ద్వారా మరింత వ్యయాన్ని తగ్గించుకుని, ఆదాయాన్ని పెంచుకునే అకాశం ఉందని భావిస్తోంది.