జగన్ అమలు చేయలేని హామీ ఇచ్చారా: సాధ్యం కాదని తేల్చిన ఛైర్మన్: చేస్తామంటున్న వైసీపీ..!
ఎన్నికల వేళ జగన్ అనేక హామీలు గుప్పించారు. ప్రతీ హామీని అమలు చేసే మరోసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ అమలు కాదని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు అసలు జగన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఆ హామీ ఇచ్చారా..లేక రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారా..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం..
ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ తన హామీల్లో భాగంగా ఆర్టీసీ కార్మికులకు కీలక హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పుకొచ్చారు. దీని పైన ఆర్టీసి కార్మికులు..ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. తాను మాట ఇస్తే తప్పనని..ఖచ్చితంగా అమలు చేస్తామని జగన్ స్పష్టం చేసారు. అదే సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసిన తరువాతనే ఓట్ల కోసం మరోసారి ప్రజల ముందుకు వస్తానని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆర్టీసి భారీ నష్టాల్లో ఉంది. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసులు ఇచ్చారు. సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసి హెచ్చరించింది. కానీ, కార్మికులు మాత్రం ఎస్మాతో తమను అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో జగన్ ఇచ్చిన హామీ మీదా చర్చ మొదలైంది.
ఎంత మాత్రం సాధ్యం కాదు..
జగన్ ఇచ్చిన హమీ ఇచ్చిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎంతమాత్రమూ సాధ్యం కాదని ఆ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఆర్టీసీలో కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వటం పైన స్పందించిన ఆయన 2015 తర్వాత ఆర్టీసీ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని వివరించారు. ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను రాయితీ ఇస్తే సంస్థ నష్టాల నుంచి బయట పడుతుందని వర్ల రామయ్య వివరించారు. ప్రతీ ఏడాది 7.5 శాతం చార్జీలను పెంపుకు అనుమతివ్వాలని ప్రభుత్వం ముందు తాము ప్రతిపాదన పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీసీని జేబు సంస్థగా మార్చింది కాంగ్రెస్సేనని, వైసీపీ నేతలు ఆర్టీసీని నాశనం చేయాలని చూస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. రాజకీయంగా రామయ్య చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్జీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం పైనా సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.
జగన్ మాట నిలబెట్టుకుంటారు..
ఆర్టీసి గురించి రచ్చ జరగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు స్పందించారు. వైసీపీ నేత పార్ద సారధి ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం పై ఆరోపణలు చేసారు. దొంగ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ల ద్వారా ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న విషయం చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు. కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారని మరోసారి స్పష్టం చేసారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో..ఇప్పుడు సాంకేతిక అంశాల పైన దృష్టి పెట్టారు. లక్షలాది కార్మికులు ఆధార పడిన ఆర్టీసి పైన ఇప్పుడు రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే సాధ్యపడుతుంది.